Begin typing your search above and press return to search.

షాకింగ్‌: కేంద్ర మంత్రి చెంప చెళ్లు

By:  Tupaki Desk   |   9 Dec 2018 8:24 AM GMT
షాకింగ్‌: కేంద్ర మంత్రి చెంప చెళ్లు
X
కేంద్ర మంత్రి - రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) అధ్యక్షుడు రాందాస్‌ అథవాలేకు అత్యంత చేదు అనుభ‌వం ఎదురైంది. మ‌హారాష్ట్రలోని అంబ‌ర్‌నాథ్ ప‌ట్ట‌ణంలో ఓ యువ‌కుడు ఆయన చెంప చెళ్లుమ‌నిపించాడు. ఈ అనూహ్య ఘ‌ట‌న‌తో అథ‌వాలే బిత్త‌ర‌పోయారు.

అస‌లేం జ‌రిగిందంటే.. శ‌నివారం రాత్రి అంబర్‌నాథ్‌లో జరిగిన ఓ సభలో అథ‌వాలే పాల్గొన్నారు. కార్యక్రమం ముగిశాక కార్యకర్తలతో ముచ్చటించాల‌ని భావించారు. వారిని క‌లిసేందుకు వేదిక దిగి కిందకు చేరుకున్నారు. ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఆ సమయంలో ఓ యువ‌కుడు అథ‌వాలే వైపు ఒక్క‌సారిగా దూసుకొచ్చాడు. అంద‌రూ చూస్తుండ‌గానే ఆయన చెంపను చెళ్లుమనిపించాడు. మంత్రిని తోసేయ‌డానికి కూడా ప్ర‌య‌త్నించాడు.

ఈ అనూహ్య ఘ‌ట‌న‌తో అథ‌వాలే స‌హా అక్క‌డున్న‌వారంతా నివ్వెర‌పోయారు. అప్ర‌మ‌త్త‌మైన మంత్రి భ‌ద్ర‌తా సిబ్బంది.. నిందితుణ్ని ప‌క్క‌కు లాక్కెళ్లారు. అథ‌వాలేను అక్క‌ణ్నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. అనంత‌రం ఆర్ఐపీ కార్య‌క‌ర్త‌లు నిందితుడిపై దాడి చేశారు. అత‌ణ్ని పోలీసుల‌కు అప్ప‌గించారు.

అథ‌వాలే చెంప చెళ్లుమ‌నిపించిన నిందితుణ్ని ప్ర‌వీణ్ గోసావిగా పోలీసులు గుర్తించారు. అత‌డు ఎందుక‌లా దాడి చేశాడో ప్ర‌స్తుతానికి తెలియ‌రాలేదు. ఈ షాకింగ్‌ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత అథవాలే ముంబైకి వెళ్లిపోయారు. అథవాలేపై దాడి జరిగిందనే విషయం తెలియడంతో ముంబైలోని ఆయన నివాసానికి ఆర్ఐపీ కార్య‌క‌ర్త‌లు పెద్దయెత్తున చేరుకున్నారు. పథకం ప్రకారమే అథ‌వాలేపై దాడి జ‌రిగింద‌ని వారు ఆరోపించారు. అథవాలేపై దాడికి నిరసనగా ఆదివారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు.