Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు రామప్పకు యునెస్కో గుర్తింపు.. ఎంపికలో ఎంత డ్రామా జరిగిందంటే?

By:  Tupaki Desk   |   26 July 2021 4:10 AM GMT
ఎట్టకేలకు రామప్పకు యునెస్కో గుర్తింపు.. ఎంపికలో ఎంత డ్రామా జరిగిందంటే?
X
800 ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు ఎట్టకేలకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా.. విజ్ఞాన సాంస్కృతిక సంస్థ) చేపట్టిన గుర్తింపు ప్రక్రియలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పోటీని ఎదుర్కొని మరీ రామప్ప గుర్తింపు దక్కించుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం చైనాలో వర్చువల్ గా సాగుతోంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి కావటం.. రామప్ప టెంపుల్ కు అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.

దీనిపై ప్రధాని మోడీతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు యునెస్కోకు నామినేట్ అయినప్పటికి రామప్ప టెంపుల్ మాత్రం జాబితాలో చోటు దక్కించుకోలేని దుస్థితి. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా రామప్ప దేవాలయానికి గుర్తింపు లభించింది. నార్వే అడ్డుపల్ల వేసినా.. రష్యా మద్దతుతో ముందుకు సాగే అవకాశం లభించింది. కాకతీయుల ఘనమైన శిల్ప కళా వైభవానికి.. అద్భుత నిర్మాణశైలికి ప్రతీకగా నిలిచే రామప్ప టెంపుల్ ఇప్పుడు విశ్వం చూపు పడినట్లైంది.

ఇసుక పునాదులు.. తేలే ఇటుకలు.. సూది రంధ్రం సందుతో అతి సూక్ష్మ శిల్పాలు.. విభిన్న రూపాల్లో వందలాది ఏనుగుల బొమ్మలు.. ఇలా వర్ణించేందుకు మాటలు సరిపోని అత్యద్భుత కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ శిల్ప కళా వైభవంలో ఇప్పటికి అంతుచిక్కని రహస్యాలెన్నో. దీని ఇంజనీరింగ్ టెక్నాలజీ నేటి డిజిటల్ యుగంలోనూ అబ్బురపడేలా చేయటం దీని ప్రత్యేకత. ఇదే తాజాగా యునెస్కో గుర్తింపు లభించేలా చేసింది. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన మొట్టమొదటి కట్టడంగా దీన్ని చెప్పాలి.

యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించినందుకు అందరికి శుభాకాంక్షలు. ఇదో అద్భుతం. దీనికి తెలంగాణ ప్రజలకు ప్రత్యేక శుభాభినందనలు. ఈ అద్భుత ఆలయానికి వెళ్లండి. ఆలయ ఠీవీని ప్రత్యక్షంగా తిలకించి ఆ అనునభూతిని సొంతం చేసుకోండని పేర్కొన్నారు. యునెస్కో గుర్తింపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. రామప్ప కట్టడాన్ని గుర్తించినందుకు.. అందుకు సహకరించిన దేశాలకు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. స్వయం పాలనలో తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు అంత తేలిగ్గా రాలేదు. ఎంపిక వేళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రామప్పను జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించింది. దాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు తొమ్మిది లోపాలు ఉన్నట్లుగా పేర్కొంది. అయితే..రష్యా ప్రత్యేక చొరవ తీసుకోవటంతో యునెస్కో గుర్తింపు సాధ్యమైంది. 2019 నాటి ఐసీవోఎంవోఎస్ నివేదిక (పురావస్తు కట్టడాలు, క్షేత్రాల అంతర్జాతీయ మండలి)ను తప్పు పడుతూ 22.7 నిబంధన ప్రకారం రామప్పను అరుదైన కట్టడాల నామినేషన్లలో పరిగణలోకి తీసుకోవటానికి వీలుగా నిర్నయం తీసుకున్నారు.

భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక దౌత్య రాయబారం నడిపింది దీంతో.. చారిత్రక కట్టడాలను ఎంపిక చేసేందుకు వచ్చిన ప్రతినిధుల తాలూకు 24 దేశాలకు చెందిన చారిత్రక కట్టడంగా రామప్పను వివరించింది. దీంతో.. రామప్పకు అనుకూలంగా 17 దేశాలు ఓట్లు వేశాయి.

రామప్పకు మద్దతు ఇచ్చిన దేశాల్లో రష్యాతో ఇథియోపియా.. ఒమన్.. బ్రెజిల్.. ఈజిప్టు.. స్పెయిన్.. థాయ్ లాండ్..హంగేరీ.. సౌదీ అరేబియా.. సౌతాఫ్రికాతో పాటు మొత్తం 17దేశాలు అనుకూలంగా ఓట్లు వేయటంతో రామప్ప యునెస్కో జాబితాలో చేరింది.