Begin typing your search above and press return to search.

పులివెందుల‌లో ర‌మ‌ణ దీక్షితులు!..ఏం జ‌రుగుతోంది!

By:  Tupaki Desk   |   16 May 2019 5:22 PM GMT
పులివెందుల‌లో ర‌మ‌ణ దీక్షితులు!..ఏం జ‌రుగుతోంది!
X
ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ఏపీలో ఆస‌క్తికర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ‌త నెల 11న పోలింగ్ జ‌ర‌గ‌గా... ఈ నెల 23న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు మధ్యాహ్నానికే ఏ పార్టీకి అధికార‌మో తేలిపోనుంది. ఇప్ప‌టిదాకా వెలువ‌డిన స‌ర్వేల‌న్నీ కూడా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీదే విజ‌య‌మ‌ని చెప్పాయి. టీడీపీ మ‌రోమారు అధికారంలోకి వ‌స్తుంద‌ని ఒక్క‌టంటే ఒక్క స‌ర్వే కూడా చెప్పిన దాఖ‌లా లేదు. టీడీపీ అనుకూల మీడియా ఆ పార్టీ విజ‌యంపై ప్ర‌చురించిన స‌ర్వేలు కూడా డొల్ల స‌ర్వేలేన‌ని తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని దాదాపుగా అంతా అనుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో వైసీపీ కేంద్రంగా చాలా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌దిగా గుర‌వారం చోటుచేసుకుంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్ధానంలో ప్ర‌ధాన అర్చ‌కుడిగా ప‌నిచేసి చంద్ర‌బాబు స‌ర్కారు చేతిలో తీవ్ర అవ‌మానానికి గురైన ర‌మ‌ణ దీక్షితులు గురువారం జ‌గ‌న్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం పులివెందుల ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్ ఉంటే... ఆయ‌న‌తో భేటీ అయ్యేందుకు దీక్షితులు కూడా పులివెందుల‌కే వెళ్లారు. జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న ప్ర‌జా ద‌ర్బార్ కు వెళ్లిన దీక్షితులు... జ‌గ‌న్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప‌లు కీల‌క అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చినట్టుగా తెలుస్తోంది. త‌న‌ను తొల‌గించిన టీడీపీ స‌ర్కారుపై దీక్షితులు ఏకంగా యుద్ధాన్నే ప్ర‌క‌టించారు. టీడీపీ పాల‌న‌లో టీటీడీలో జ‌రిగిన ప‌లు అక్ర‌మాల‌కు సంబంధించి దీక్షితులు గ‌ట్టిగానే నోరు విప్పారు. టీటీడీ వ్య‌వ‌హారాల‌పై న్యాయ‌స్థానాల వేదిక‌గా పోరాటం చేస్తున్న బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌హ్మ‌ణ్యం స్వామికి కూడా అవ‌స‌ర‌మైన మేర ఆధారాల‌ను అందించారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ తో బేటీ సంద‌ర్భంగానూ టీడీపీ హ‌యాంలో టీటీడీలో చోటుచేసుకున్న అక్ర‌మాలు, తిరుమ‌ల ఆల‌య ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చే విధంగా తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌పై వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా టీడీపీ హ‌యాంలో టీటీడీలో చోటుచేసుకున్న అక్ర‌మాల గుట్టు మొత్తాన్ని దీక్షితులు... జ‌గ‌న్ చేతిలో పెట్టిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. స‌ర్వేల‌న్నీ చెబుతున్న‌ట్లుగా జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే... దీక్షితులు తిరిగి త‌న స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. మొత్తంగా అధికారంలోకి వ‌చ్చాక‌... టీడీపీ హ‌యాంలో టీటీడీలో చోటుచేసుకున్ అక్ర‌మాల‌పై కాస్తంత గ‌ట్టిగానే చ‌ర్య‌లు ఉండే అవ‌కాశాలున్నాయ‌న్న మాట ఈ భేటీతో స్ప‌ష్ట‌మైంద‌న్న వాద‌న వినిపిస్తోంది.