Begin typing your search above and press return to search.

వాట‌ర్ బాటిల్ల ధ‌రల్లో ఇక తేడా ఉండదు

By:  Tupaki Desk   |   8 March 2017 2:29 PM GMT
వాట‌ర్ బాటిల్ల ధ‌రల్లో ఇక తేడా ఉండదు
X
సంద‌ర్భం ఎలాంటిదైనా బ‌య‌ట‌కు వెళితే దాహం వేస్తే మ‌నం వెంట‌నే వెతికేది మిన‌ర‌ల్ వాటర్ బాటిల్ కోసం. కాసిన్ని నీళ్లు తాగితే పెద్ద రిలీఫ్ వ‌స్తుంది. అయితే ఈ వాట‌ర్‌ బాటిల్ల ధ‌ర ఒక్కో చోట ఒక్కో ర‌కంగా ఉంటుంది. ఇలా బాటిల్ల‌లో అమ్మే మిన‌ర‌ల్ వాట‌ర్‌ను ఎంఆర్‌పీకి మించి అమ్ముతున్నార‌ని పెద్ద ఎత్తున వ‌చ్చిన ఫిర్యాదుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు స్పందించింది. వినియోగ‌దారులు వ్య‌వ‌హారాల శాఖా మంత్రి రాం విలాస్ పాశ్వాన్ వాట‌ర్ బాటిల్ల మాఫియాపై స్పందిస్తూ దేశ‌వ్యాప్తంగా ఒకే ధ‌ర‌కు అమ్మాల‌ని ఆదేశించారు. అంతేకాకుండా దీన్ని త్వ‌రలో చ‌ట్టం రూపంలో తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఇక‌నుంచి సినిమా హాల్ అయినా, రైల్వే స్టేష‌న్ అయినా, ఎయిర్‌పోర్ట్ అయినా అన్ని చోట్లా ఒకే ధ‌ర ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ ఎంఆర్‌పీకి మించి అమ్మ‌కం చేస్తే వారి వివ‌రాల‌ను తెలియ‌చేస్తే త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు.

మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిల్ అమ్మే సంస్కృతి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బాటిల్డ్ వాట‌ర్ ధ‌ర వేర్వేరు చోట్ల వేర్వురు ధ‌ర‌ల్లో ఎందుకు ఉంటుంద‌నే సందేహం అంద‌రిలోనూ ఉండేది. ముఖ్యంగా సినిమాహాళ్లు - ఎయిర్‌ పోర్ట్‌ లు - రైల్వే స్టేష‌న్ల‌లో అయితే ఎమ్మార్పీకి, ధ‌ర‌కు అస‌లేమాత్రం పొంత‌న ఉండేది కాదు. దీంతో అనేక‌మంది మిన‌ర‌ల్ వాట‌ర్ మాఫియాపై వినియోగ‌దారుల ఫోరాల్లో కేసులు వేశారు, ప్ర‌భుత్వాల‌కు ఫిర్యాదులు చేశారు. ఎట్ట‌కేల‌కు స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం దీనికి కొత్త చ‌ట్టం తెచ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ చ‌ట్టం ప‌రిధిలోకి వాట‌ర్ బాటిల్ కంపెనీలను, డీల‌ర్ల‌ను తీసుకువ‌స్తూ ఆదేశాలు ఇవ్వ‌నుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా కేంద్ర మంత్రి వివ‌రాలు వెల్ల‌డించారు. ఇపుడు మ‌నం చేయాల్సింద‌ల్లా ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధ‌ర‌కు మిన‌ర‌ల్ వాట‌ర్ అమ్మితే వెంట‌నే ఫిర్యాదు చేయ‌డం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/