Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్ ను గెలిపిస్తే ఏం చేశారు.. బీజేపీ..?

By:  Tupaki Desk   |   9 Aug 2022 6:31 AM GMT
ఆర్ఆర్ఆర్ ను గెలిపిస్తే ఏం చేశారు.. బీజేపీ..?
X
రాజనాథ్ సింగ్.. రఘునందన్ రావు.. రాజేందర్ (ఆర్ఆర్ఆర్) ను ప్రజలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను కాదని గెలిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా తాము ఎక్కువ అభివృద్ధి చేస్తామని ప్రజలకు చెప్పారు. కానీ ఆర్ఆర్ఆర్ గెలిచిన తరువాత ఏం చేశారు..? వీరు గెలిచిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా పడిపోయిందా..? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే ఏం చేస్తారు..? ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కు ఎటువంటి నష్టం ఉండదు.. ఈ తరుణంలో అసలు బీజేపీ నాయకులను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తారా..? ఇప్పటి వరకు ఒక్క రూపాయైనా తెచ్చారా..? అని తెలంగాన ప్రజానీకం చర్చించుకుంటోంది.

2018 ఎన్నికల్లో బీజేపీ ఒక్కటంటే ఒక్కటే సీటు గెలుచుకుంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ గెలుపొందారు. దీంతో ఇక బీజేపీ పని అయిపోయిందని అప్పుడు అందరూ అనుకున్నారు. కానీ ఎంపీగా నాలుగు సీట్లు గెలుచుకోవడం బీజేపీకి కాస్త లాభించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో బీజేపీ పట్టు సాధించడం ప్రారంభమైంది. అప్పటికే రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కొన్ని విషయాల్లో ప్రజలను పట్టించుకోలేదు. అభివృద్ధికి నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేసింది. ఈ సమయంలో దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీకి వరం అయింది.

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ తరుపున బరిలో ఉన్న రఘనందన్ రావు.. తమ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర నుంచి నిధులు తెస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే అప్పటికే ఈ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో వెనుకబడింది. దీంతో రఘునందన్ రావు మాటలు నమ్మి ఆయనను గెలిపించారు. అంతేకాకుండా ఈ ఉప ఎన్నిక సమయంలో తనపై దాడి చేశారని చేతికి బ్యాండ్ వేసుకొని మరీ ప్రజల్లో సింపతి పొందారు. మొత్తంగా అధికారంలోకి వచ్చిన రఘునందన్ రావు ఆ తరువాత ప్రజలను పట్టించుకోవడం మరిచిపోయారని అంటున్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని అంటున్నారు.

ఇక మరో నియోజకవర్గం హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలోనూ ఇదే జరిగింది. అప్పటి వరకు టీఆర్ఎస్ లో మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ తమ నియోజక వర్గానికి చేయలేని అభివృద్ధిని కేంద్రం నుంచి నిధులు తెస్తానని మాట ఇచ్చారు. కానీ ఆయన కూడా పరమార్శలు, ఫంక్షన్లకు తప్ప ఎక్కడా కనిపించడం లేదు. దళిత బంధు పేరిటి కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికి వందల కోట్ల నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. డబ్బులు కాదని మరీ ఈటల రాజేందర్ ను స్థానిక ప్రజలు గెలిపించారు. మరి ఆయన ఎన్నిక అయిన 10 నెలల్లో ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలన ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారేందుకు రెడీగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు మరో ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తున్నారు.

ఇలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గానికి ఎలాంటి లాభం చేయగలుగుతారని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. బీజేపీ కేవలం తన ప్రాబల్యం పెంచుకోవడానికి... ప్రజలను ఆకట్టుకోవడానికి అభివృద్ధి నినాదాలు చేస్తోంది. నిజంగా నిధులు తెచ్చే సత్తా ఉంటే.. కరీంనగ్ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గానికి ఎన్ని నిధులు విడుదల చేశారో తెలపాలని డిమాండ్ చేస్తున్నారు.