Begin typing your search above and press return to search.

'ల‌క్ష్మీస్‌' కు బ్రేకులేనా!... ఈసీ మాటేమిటో?

By:  Tupaki Desk   |   12 March 2019 1:14 PM GMT
ల‌క్ష్మీస్‌ కు బ్రేకులేనా!... ఈసీ మాటేమిటో?
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల సైర‌న్ మోగిన వేళ‌... దేశవ్యాప్తంగా ప్ర‌త్యేకించి తెలుగు నేల‌ - అందులోనూ మ‌రింత ప్ర‌త్యేకించి ఏపీకి సంబంధించి ప‌రిణామాలు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత అటు అధికార పార్టీ టీడీపీతో పాటు ఇటు విప‌క్షం వైసీపీ - మ‌రో పార్టీ జ‌న‌సేన కూడా త‌న అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తుల్లో మునిగిపోయాయి. అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌డం - కొత్త‌గా వ‌చ్చి చేరుతున్న నేత‌ల‌కు చోటు క‌ల్పించ‌డం త‌దిత‌ర కార్య‌క్రమాల‌తో బిజీబిజీగా ఉన్న పార్టీలు ఇత‌ర విష‌యాల‌పై అంత‌గా దృష్టి సారించ‌డం లేదన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఓ ఆస‌క్తిక‌ర వార్త ఏపీలోనే కాకుండా తెలంగాణ‌లోనూ వైర‌ల్ గా మారిపోయింది. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు - మాజీ సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ‌... ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఓ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటోంది. ఈ నెల 22న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే వర్మ ప్ర‌క‌టించేశారు కూడా.

అయితే ఈ చిత్రంలో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడును ల‌క్ష్యంగా చేసుకుని ఆయ‌ననే విల‌న్ చూపించేలా చిత్రాన్ని వ‌ర్మ తెర‌కెక్కించిన‌ట్టుగా ఇప్ప‌టికే దాదాపుగా తేలిపోయింది. ఈ విష‌యాన్ని వ‌ర్మ స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ పోస్టులు - టీజ‌ర్లు - ట్రైల‌ర్ల ద్వారా తేల్చేశార‌నే చెప్పాలి. మ‌రి ఈ సినిమా ఎన్నిక‌ల వేళ విడుద‌లైతే... చంద్రబాబుకే కాకుండా మొత్తంగా టీడీపీకే దెబ్బేస్తుంది క‌దా. ఇలాంటి కార్య‌క‌లాపాల‌ను చూస్తూ ఈసీ చేతులు ముడుచుకుని కూర్చుంటుందా? ఎన్నిక‌ల వేళ ఈసీ చేతులు ముడుచుకుని ఎంత‌మాత్రం కూర్చోద‌ని తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. ఎల‌క్ష‌న్ కోడ్ అమ‌ల్లో ఉన్న స‌మ‌యంలో ఈ త‌ర‌హా సినిమాల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరును ప్ర‌స్తావించ‌కుండానే తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్‌ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. మీడియాలో వచ్చే క‌థ‌నాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో వ‌చ్చే క‌థ‌నాల‌పైనా ఎన్నిక‌ల సంఘం నిఘా త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంద‌ని చెప్పిన ర‌జ‌త్‌... ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేలా ఉండే సినిమాల‌పైనా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బాంబు పేల్చారు. అయితే ఇప్ప‌టిదాకా త‌మ‌కు ఏ ఒక్క సినిమాపైనా ఫిర్యాదు రాలేద‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే ఏపీలో ఓటర్ల‌ను ప్ర‌భావితం చేయ‌నుంద‌ని భావిస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ పై ఇటు ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారితో పాటు తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి గోపాల‌కృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు అంద‌కున్నా... నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికే ఈ చిత్రంపై ఫిర్యాదు వెళ్లింది. దేవిబాబు అనే వ్య‌క్తి ఈ చిత్రంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబును నెగెటివ్‌గా చూపిస్తూ ఈ సినిమా రూపొందింద‌ని - ఎన్నిక‌ల వేళ ఈ చిత్రం రిలీజైతే... టీడీపీకి పెద్ద న‌ష్ట‌మేన‌ని వాదించిన ఆయ‌న ఆ చిత్రం రిలీజ్‌ను అడ్డుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికే ఈ ఫిర్యాదును ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదీకి పంపిన ఈసీ... ఈ విష‌యం ఏమిటో చూడాలంటూ ఆదేశాలు జారీ చేసింద‌ట‌. ఈ ప‌రిణామాలు - ర‌జ‌త్ వ్యాఖ్య‌లు చూస్తుంటే.. త నెల 22న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ విడుద‌ల అసాధ్య‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.