Begin typing your search above and press return to search.

పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. టపాసులు కాల్చి గాంధీభవన్ లో సంబరాలు

By:  Tupaki Desk   |   3 Aug 2022 4:53 AM GMT
పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. టపాసులు కాల్చి గాంధీభవన్ లో సంబరాలు
X
సాధారణంగా పార్టీకి చెందిన సీనియర్ నేత వేరే పార్టీలోకి వెళితే ఏమవుతుంది? ఆ భారీ ఎదురుదెబ్బతో తీవ్రమైన ఒత్తిడికి గురి కావటం.. మౌనంగా ఉండటం.. భారీ నష్టం జరిగినట్లుగా ఉండటం లాంటివి చూస్తుంటాం.

కానీ.. మంగళవారం మాత్రం అందుకుభిన్నమైన సీన్.. ఆవిష్క్రతమైంది. ఎన్నాళ్లుగానో ఇప్పుడు వెళ్లిపోతారు.. అప్పుడు వెళ్లిపోతారంటూ ప్రచారం సాగిన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరనున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆయన తదుపరి మజిలీ బీజేపీ అన్న విషయం తెలిసిందే.

గడిచిన కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన రాజగోపాల్ రెడ్డిని.. పార్టీ మారకుండా చూడటానికి కాంగ్రెస్ కు చెందిన కొందరు ప్రయత్నించినా.. రేవంత్ అండ్ కో మాత్రం మౌనంగా ఉండిపోయారు. చివరకు తాను తీసుకున్న నిర్ణయంలో భాగంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ను.. సోనియాగాంధీని తిట్టిన వారిని తీసుకొచ్చి వాళ్ల కింద తమను పని చేయాలని చెబుతున్నారని.. తమకు ఆత్మగౌరవం లేదా? అని ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయటాన్ని తప్పు పట్టారు. తెలంగాణ ఇచ్చి కూడా తప్పులు చేసి మూర్ఖంగా పార్టీని నాశనం చేశారన్న ఆయన.. ఈ కారణాలతోనే కాంగ్రెస్ కార్యకర్తలు నష్టపోయినట్లుగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

విచిత్రమైన విషయం ఏమంటే.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినంతనే.. పార్టీకి తెలంగాణలో ప్రధాన కార్యాలయం అయిన గాంధీ భవన్ లో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుకొని ఆనందాన్ని వ్యక్తం చేయటం విశేషం.

పార్టీని తలనొప్పిగా మారి.. నిత్యం ఏదో లొల్లితో రచ్చ చేసే రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోవటం పార్టీకి మేలు చేస్తుందన్న మాటను కొందరు కార్యకర్తలు వ్యక్తం చేశారు. మొత్తంగారాజగోపాల్ రెడ్డి ఎగ్జిట్ తో కాంగ్రెస్ హ్యాపీగా ఉందన్న భావన తాజా పరిణామంతో చెప్పినట్లైందన్న మాట వినిపిస్తోంది.