Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ను కుదిపేస్తున్న 'రాజ‌గోపాల్ రాజ‌కీయం'

By:  Tupaki Desk   |   27 Jun 2022 4:29 AM GMT
కాంగ్రెస్‌ను కుదిపేస్తున్న రాజ‌గోపాల్ రాజ‌కీయం
X
కోమ‌టిరెడ్డి సోద‌రుల్లో ఒక‌రైన రాజ‌గోపాల్‌రెడ్డి.. చేస్తున్న రాజ‌కీయం.. కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తో్ంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక నియోజకవర్గం మునుగోడు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో అనే అనుమానాన్ని నెల‌కొంది. దీనికి కార‌ణం ఆయ‌న‌ ఎప్పడూ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుంటారు. వీలు చేసుకుని మరీ బీజేపీని పొగుడుతుంటారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఏకంగా రాహుల్ గాంధీ వరంగల్‌ సభకు కూడా డుమ్మా కొట్టారు.

దీంతో మునుగోడులో పార్టీ కేడర్‌ రాజగోపాల్‌ తీరుపై సందిగ్థంలో పడిపోయింది. ఆయన పార్టీలో ఉన్నారా లేరా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతోంది. రాజగోపాల్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో నల్లగొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక వెంకటరెడ్డి స్థానంలో భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని రాజగోపాలరెడ్డి సిద్ధమవుతున్నారని సమాచారం.

అయితే ఆయన పోటీ కాంగ్రెస్‌ నుంచా, బీజేపీ నుంచా అనే క్లారిటీ లేదు. ఇప్పటికే రాజగోపాలరెడ్డి తీరు కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టికి వెళ్ళిందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ నుంచి టిక్కెట్ దక్కడం కష్టం కావచ్చనే ప్రచారం జ‌రుగుతోంది. దీంతో రాజగోపాలరెడ్డి పార్టీ మారడం పక్కా అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీకి నెక్ట్స్‌ లీడర్‌ ఎవరు అనే చర్చ ఊపందుకుంది.

2014, 2018 మునుగోడు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిన వారిలో పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, పున్న కైలాస్ ఉన్నారు. వీరిలో పాల్వాయి స్రవంతి మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె. ఆమె ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కేడర్‌తో సత్సంబంధాలు మెయింటైన్‌ చేస్తున్నారు. ఈమె గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 30 వేల ఓట్లు పొందారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఈమెకు దగ్గరి బంధుత్వం ఉంది.

పైగా తండ్రి పలుకుబడి ఎటూ ఉండనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ పక్కా అని స్రవంతి ఫిక్స్‌ అయ్యారంటు న్నారు. ఇక పున్న కైలాష్‌కు విద్యార్థినాయకుడిగా పేరుంది. జేఏసీలో చురుకైన పాత్ర పోషించిన అనుభవమూ ఉంది. ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో ఓయూ జేఏసీ నేతగా జాతీయస్థాయి నేతల దృష్టిని ఆకర్షించారు. మునుగోడు లో బీసీల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నాయి. కైలాష్‌ పద్మశాలి వర్గానికి చెందినవారు. బీసీల ఓట్‌ షేర్‌ రీత్యా తనకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ కేటాయిస్తే గెలుపు సునాయసమని ఆయన నమ్ముతున్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ అధినేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

మ‌రోనేత‌.. పల్లె రవికుమార్ గౌడ్ తెలంగాణ జర్నలిస్టు ఫోరం నేతగా ప్రసిద్ధి పొందారు. తెలంగాణ ఉద్యమంలో పని చేశారు. ధూమ్ ధామ్ కార్యక్రమాలు నిర్వహించిన అనుభం ఉంది. నాటి ప్రజారాజ్యం పార్టీ నుండి నేటి వరకు ఎలాగైనా టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారు . 2018 ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన భార్య కళ్యాణి గెలిపించి చండూరు ఎంపీపీగా చేశారు. రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. మొత్తానికి ఒక్క రాజ‌గోపాల్ వ్య‌వ‌హారంతో ఇక్క‌డ కాంగ్రెస్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది.