Begin typing your search above and press return to search.

రాజాసింగ్ సంచ‌ల‌నం...ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌ను

By:  Tupaki Desk   |   6 Jan 2019 6:08 PM GMT
రాజాసింగ్ సంచ‌ల‌నం...ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌ను
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు పెట్టింది పేర‌యిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదానికి తెరలేపారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఉంటే... తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోనని తేల్చి చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారిలో అందరికన్నా సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్. ఎంఐఎం నుంచి చార్మినార్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన సీనియార్టిని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఖాన్‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.

అయితే, ఈ ఎపిసోడ్‌పై సెల్ఫీ వీడియో విడుదల చేసిన రాజాసింగ్... స్పీకర్ ఎంపిక తర్వాతే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు. మ‌జ్లిస్‌నేత‌లు భారత్ మాతాకీ జై అనరని, వందేమాతరం పాడనని చెబుతారని, అలాంటి వారు ప్రొటెం స్పీకర్‌గా ఉంటే నేను వారి ఆధ్వర్యంలో ఎలా ప్రమాణం చేస్తానని ప్రశ్నించారు. దేశం కోసం ధర్మం కోసం పని చేసే పార్టీ నుంచి గెల్చిన వ్యక్తిని నేను అని రాజాసింగ్ తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న అసెంబ్లీలో తాను ప్రమాణస్వీకారం చేయనని ప్ర‌క‌టించారు. న్యాయపరంగా సమస్యలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రాజాసింగ్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే. వందకు పైగా స్థానాల్లో బీజేపీ పోటీచేస్తే.. రాజాసింగ్ మాత్రమే గెలిచారు.