Begin typing your search above and press return to search.

రాజాసింగ్ జెండా..అజెండా మారుతుందా?

By:  Tupaki Desk   |   11 Dec 2015 3:56 AM GMT
రాజాసింగ్ జెండా..అజెండా మారుతుందా?
X
మారిన రాజకీయ పరిస్థితులకు తగ్గట్లు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుదీర్ఘకాలంపాటు బీజేపీ మిత్రుడిగా ఉంటూ.. పరిమిత పాత్రలో తనదైన రాజకీయాలు చేస్తున్న శివసేన.. ఇప్పుడు పార్టీ విస్తరణపై దృష్టి పెట్టింది. కేవలం హిందుత్వ నినాదం.. ఆ ఓటుబ్యాంకుతో తన సత్తా చాటాలని భావిస్తున్న శివసేన.. మొన్నామధ్య బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ.. అక్కడ ఎలాంటి ప్రభావం చూపించకపోవటం వేరే విషయం.

హిందూ ఓట్లు బీజేపీకే కాదు.. తమకు కూడా వాటా ఉందన్న రీతిలో ఇప్పుడా పార్టీ విస్తరణ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని షురూ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం తగిన నేత కోసం వెతుకుతున్న శివసేన.. బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యే.. కరుడుగట్టిన హిందుత్వ వాది రాజాసింగ్ అయితే.. తమకు సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ శివసేన అధ్యక్షుడిగా ఆయన్ను నియమించేందుకు సేన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీతో పొసగని రాజాసింగ్.. శివసేన రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో.. పార్టీని మరింత విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే.. ఆ మధ్య ప్రధాని మోడీ మీద రాజాసింగ్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఉస్మానియాలో నిర్వహించే బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు చంపటానికైనా.. తాను చావటానికైనా సిద్ధమని చెప్పటంతో పాటు.. ఈ విషయంలో ప్రధాని మోడీ మాటను కూడా తాను విననంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక సాదాసీదా బీజేపీ ఎమ్మెల్యే.. ప్రధాని మోడీ గురించి ప్రస్తావించి.. అలాంటి వ్యాఖ్యలు చేయటం కమలనాథుల్ని కంగుతినేలా చేసింది. రాజాసింగ్ ఎందుకిలా వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని ఆరా తీసిన బీజేపీ నేతలకు.. రాజాసింగ్ జెండా.. అజెండా మారిపోతున్న నేపథ్యంలోనే ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లుగా కమలనాథులు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు సాగితే.. ఈ నెలాఖరు నాటికి రాజాసింగ్ పార్టీ కండువా మారిపోవటం ఖాయమంటున్నారు.