Begin typing your search above and press return to search.

ఆవు మాంసం తినేటోళ్ల ఓట్లు ఆ ఎమ్మెల్యేకు వ‌ద్దంట‌!

By:  Tupaki Desk   |   27 July 2018 5:05 AM GMT
ఆవు మాంసం తినేటోళ్ల ఓట్లు ఆ ఎమ్మెల్యేకు వ‌ద్దంట‌!
X
రాజ‌కీయ నాయ‌కుడ‌న్న త‌ర్వాత మ‌న‌సులో ఏమున్నా.. తాను అంద‌రికి కావాలి.. అంద‌రి ఓట్లు త‌న‌కు కావాల‌న్న‌ట్లుగా ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ఏ రాజ‌కీయ నేత సైతం క‌ల‌లో కూడా ఊహించ‌ని రీతిలో చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. త‌న‌కు ఆవు మాంసం తినే వారి ఓట్లు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పారు గోషామ‌హాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న హైద‌రాబాద్ ఎంపీగా బ‌రిలోకి దిగ‌నున్నార‌ని.. మ‌జ్లిస్ అధినేత‌పై పోటీకి దిగ‌నున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటివేళ‌.. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతున్నాయి.

తన‌కు హిందువుల ఓట్లు చాల‌న్న ఆయ‌న‌.. ఈ విష‌యాన్ని గ‌తంలోనూ చెప్పాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ ప్ర‌చారం చేసినా ఇదే చెబుతాన‌ని స్ప‌ష్టం చేశారు. దేశ వ్యాప్తంగా మ‌జ్లిస్ ఎక్క‌డ కాలు పెడితే.. త‌న‌ను కూడా ఆయా ప్రాంతాల్లో ప్ర‌చారం చేయాల‌ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా త‌న‌ను ఆదేశించార‌న్నారు. హిందుత్వ ప‌రిర‌క్ష‌ణ కోస‌మే బీజేపీ పుట్టింద‌న్న ఆయ‌న‌.. త‌న‌ను పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా క‌లుస్తాన‌ని చెప్ప‌టం తెలుసుకొని ఆశ్చ‌ర్య‌పోయాన‌న్నారు.

మ‌జ్లిస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని హిందువులున్న‌ప్రాంతాల్లో అభివృద్ధి లేద‌న్న ఆయ‌న‌.. త‌మ పార్టీ ఎమ్మెల్యేలున్న ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌ర్గాల‌కు అతీతంగా అభివృద్ధి జ‌రుగుతోంద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా.. ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేయ‌మ‌న్నా ఆనందంగా పోటీ చేస్తాన‌ని.. హైద‌రాబాద్‌.. సికింద్రాబాద్ ఎంపీ స్థానాల నుంచే కాదు తెలంగాణ‌లో ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధ‌మ‌న్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఒక ఎమ్మెల్యే ఇంత సూటిగా.. త‌న‌కు ఫ‌లానా వారి ఓట్లు మాత్ర‌మే కావాల‌న‌టం రాజా సింగ్‌కు మాత్ర‌మే చెల్లుతుందేమో?