Begin typing your search above and press return to search.

కేక్ మీద అసద్ బొమ్మేసి మరీ కట్ చేశాడు

By:  Tupaki Desk   |   15 Jun 2016 11:39 AM IST
కేక్ మీద అసద్ బొమ్మేసి మరీ కట్ చేశాడు
X
ప్రత్యర్థుల మీద కోపం మామూలే. మిగిలిన వారితో పోల్చినప్పుడు రాజకీయ నేతల్లో ఈ తరహా ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అలా అని.. హద్దులు మీరి మరీ వ్యవహరించటం ఎవరికీ మంచిది కాదు. రాజకీయ వైరాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకోవటమే కాదు.. అందరూ తప్పు పట్టేలా వ్యవహరించారు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే. ఆయన 48వ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక బర్త్ డే కేక్ ను తీసుకొచ్చారు.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బొమ్మతో కూడిన కేక్ ను తీసుకొచ్చిన ఆయన అభిమానులు తమ పైత్యాన్ని ప్రదర్శిస్తే.. అలాంటి తరహా పనులు మంచివి కావని చెప్పాల్సిన రాజ్ థాక్రే.. అందుకు భిన్నంగా ఆ కేక్ ను కట్ చేసి.. తనదైన శైలిలో వివాదానికి తెర తీశారు. కేక్ కట్ చేసిన తర్వాత.. కత్తితో అసద్ బొమ్మను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం.. ఆ ఫోటో కాస్తా మీడియాలోకి.. సోషల్ మీడియాలోకి రావటంతో అది కాస్త వైరల్ గా మారింది. రాజ్ ఠాక్రే చేసిన పనిని పలువురు తప్పు పడుతున్నారు. ఇక.. మహారాష్ట్ర మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ అయితే.. ఈ కేకు వ్యవహారంలో సంబంధం ఉన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయంగా ఎంత విరోధం ఉంటే మాత్రం ఇలా శృతిమించిన చేష్టలు ఏ మాత్రం బాగోవన్న విషయం రాజ్ ఠాక్రే లాంటి వారికి ఎప్పటికి అర్థమవుతుందో..?