Begin typing your search above and press return to search.

అసదుద్దీన్ కు అసలైన వార్నింగ్

By:  Tupaki Desk   |   9 April 2016 10:13 AM GMT
అసదుద్దీన్ కు అసలైన వార్నింగ్
X
ఎంఐఎం అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంతగా దుమారం రేపాయో తెలిసిందే. తన గొంతుపై కత్తిపెట్టినా కూడా తాను భారత్ మాతాకీ జై అని అనే ప్రసక్తే లేదని ప్రకటించిన ఒవైసీ మాటలపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందించారు. ఎందరో ఆయన తీరును తప్పుపట్టారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల యోగా గురు బాబా రాందేవ్ అయితే.... ఆ మాట అన్న అసద్ లాంటి వాళ్ల పీకలు కోసేవాడినే కానీ చట్టాల పట్ల ఉన్న విధేయత వల్ల ఆ పనిచేయలేకపోతున్నానని ప్రకటించారు. తాజాగా... అసద్ కు అలాంటి మొహమాటాలేమీ లేని వార్నింగు వచ్చింది. మహారాష్ట్ర వస్తే అసద్ గొంతుపై కత్తి పెడతామని మరాఠీ నేత రాజ్ ఠాక్రే హెచ్చరించారు.

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్ ఠాక్రే తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ మహారాష్ట్రకు వస్తే... ఆయన కుత్తుకపై తాను కత్తి పెడతానంటూ రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిన్న గుడి పడ్వా పర్వదినాన్ని పురస్కరించుకుని ముంబైలోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా రాజ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ సోదరులిద్దరూ బీజేపీ మద్దతుగానే వ్యవహరిస్తున్నారని కూడా ఠాక్రే ఆరోపించారు. మరి ఈ నేపథ్యంలో... అసద్ ఈసారి మహారాష్ట్ర వెళ్లినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.