Begin typing your search above and press return to search.

ముంబైలో మళ్లీ అరాచకం

By:  Tupaki Desk   |   11 March 2016 4:52 AM GMT
ముంబైలో మళ్లీ అరాచకం
X
దేశ ఆర్థిక రాజధాని ముంబై మ‌రోమారు విద్వేష పూరిత వ్యాఖ్య‌ల‌కు వేదిక‌గా మారింది. మ‌రాఠేత‌రుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ముందుండే మహారాష్ట్ర నవ్ నిర్మాణసేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే తాజాగా ఆటో డ్రైవ‌ర్ల‌పై ప‌డ్డారు. ముంబై నగరంలో 70 శాతం మందికి పైగా మరాఠేతరులే ఆటోరిక్షా ​​పర్మిట్లను కలిగి ఉన్నారని రాజ్‌ ఠాక్రే ఆరోపించారు. దీంతో మరాఠీలు వివక్షకు గురవుతున్నారని అందుకే ఉత్తరాదివారి ఆటో రిక్షాల్ని తగలబెట్టేస్తామంటూ రాజ్‌థాకరే వ్యాఖ్యానించారు.

ఉత్త‌రాదివారు నడిపే ఆటో రిక్షాలు కనిపిస్తే ఎంఎన్ ఎస్ కార్యకర్తలు వాటికి నిప్పంటిస్తారని ఆయ‌న‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజ్‌ థాకరే వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు మండిపడుతున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు చోద్యం చూస్తోందని, హింసకు పాల్పడతామని ఎంఎన్ఎస్ అధినేత బహిరంగంగానే హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. జేఎన్‌ యూ విద్యార్థి కన్హయ కుమార్ విద్వేష ప్రసంగం చేశాడంటూ దేశద్రోహ కేసు పెట్టిన బీజేపీ ప్రభుత్వం - ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్న రాజ్‌ థాకరే పట్ల ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబయి రాజ్‌ థాకరే జాగీర్‌ కాదని, అది దేశప్రజలందరిదని బీహార్‌ ఉప ముఖ్యమంత్రి - లాలూ ప్రసాద్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. ముంబయిలోని మరాఠీయేతర వలసవాసుల ఆటోలను తగలబెట్టాలంటూ శివసేన నేత రాజ్‌ థాకరే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పాట్నాలో ఒక న్యూస్‌ ఛానల్‌ తో మాట్లాడుతూ చట్టానికి అనుగుణంగా థాకరేపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అన‌వ‌స‌ర విద్వేషాలు పెంచి పోషించేలా ఏ నాయ‌కుడు వ్య‌వ‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని కోరారు.