Begin typing your search above and press return to search.

66 రోజుల్లో జస్ట్ 35 సార్లు పెంచేశారు.. మోడీనా మజాకానా?

By:  Tupaki Desk   |   6 July 2021 4:30 AM GMT
66 రోజుల్లో జస్ట్ 35 సార్లు పెంచేశారు.. మోడీనా మజాకానా?
X
చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేకుండా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. అంతేనా.. ఇచ్చిన హామీల్ని కనీసం గుర్తుకు తెచ్చుకోవటానికి సైతం ఇష్టపడని ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందన్న విషయానికి నిలువెత్తు రూపంగా కేంద్రంలోని మోడీ సర్కారును చెప్పాలి. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ సోషల్ విభాగంతో పాటు.. నరేంద్ర మోడీ భక్తులు ఎలాంటి ప్రచారాన్ని చేపట్టారో తెలిసిందే. మోడీ పవర్ లోకి వస్తే.. పెట్రోల్ ధర లీటరుకు రూ.50కు మించదని.. లీటరు డీజిల్ ధర మరింత తక్కువగా ఉంటుందని కలల సినిమాను కళ్ల ముందు చూపించేశారు. దీంతో.. మౌనసింగ్ మన్మోహన్ మీద కోపంగా ఉన్న వారికి.. మోడీ పరివారం చెప్పిన మాటలు చాలా బాగా ప్రభావాన్ని చూపించేశాయి.

అధికారంలోకి వచ్చింది మొదలు.. అంతకంతకూ ధరల్ని పెంచేస్తూ పోతున్న మోడీ సర్కారు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పవర్లో ఉన్న ఏ పార్టీ సాధించని ఘనతను సాధించేశారు. ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలన్ని కూడా ప్రజా వ్యతిరేకతకు భయపడేది. కానీ.. మోడీ సర్కారు ఇందుకు భిన్నం. మోడీ హయాంలో పెరిగిన పెట్రోల్.. దీజిల్ ధరలన్ని దేశ రక్షణ కోసం.. సరిహద్దుల్లో మరింత సైన్యాన్ని మొహరించేందుకు.. ఆయుధ వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు నిధులు కావాలని.. అందుకే పెట్రోల్ డీజిల్ ధరల్నిపెంచుతున్నట్లుగా చెప్పే వాదన వింటే.. షాక్ తినాల్సిందే. చివరకు మోడీ భక్తులు విషయాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారంటే.. పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగాయన్న విమర్శ చేసినోళ్లకు.. దేశం మీద ఏ మాత్రం భక్తి లేదన్నట్లుగా ప్రచారం చేయటం బీజేపీ సానుభూతిపరులకే చెల్లుతుంది.

పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగినంతనే అది చాలా రంగాల మీద ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇంధన ధరలు భారీగా పెరిగినంతనే.. వాటి మీద ఆధారపడిన వారు తమ ధరల్ని పెంచేస్తారు. తిరిగి తిరిగి ఈ భారం మొత్తం మోయాల్సింది సామాన్యుడే అన్నది మర్చిపోకూడదు. ఈ మధ్యనే లీటరు పెట్రోల్ సెంచరీ దాటేయగా.. రానున్న కొద్ది రోజుల్లో (సుమారు ఈ నెలాఖరు లోపు) లీటర్ డీజిల్ సైతం సెంచరీకి చేరువైంది. గడిచిన రెండు నెలల్లో లీటరు పెట్రోల్ మీద చమురు సంస్థలు పెంచింది ఎంతో తెలుసా? అక్షరాల రూ.10. డీజిల్ మీద రూ.9 పెరిగింది. ఇలా ధరల పెరుగుదల అన్నది నిరంతరం అన్నదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

తాజాగా మరో షాకింగ్ అంశం తెర మీదకు వచ్చింది. ఇంధన ధరలు పెరగటంతో ఆటోలు.. బస్సులు.. ప్రజా రవాణాతో పాటు.. హోటళ్లలో టిఫిన్లు.. భోజనాల ధరలు పెరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రజల మీద పెద్ద ఎత్తున భారం మోపుతున్న ప్రభుత్వం తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ అదేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు గ్రాఫ్ భారీగా పడిపోతుందని చెబుతున్నారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. విడి రోజుల్లో అదే పనిగా పెరిగే ఇంధన ధరలు.. ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే మాత్రం.. వారాల తరబడి ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.

ఈ మధ్యనే ఫలితాలు వెలువడిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ వరుసగా 18 రోజుల పాటు పెట్రోల్.. డీజిల్ ధరలు అసలు పెరగలేదు. అదేమిటో.. మే 2న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మరో రెండు రోజుల నుంచి ధరల్ని పెంచుకుంటూ పోతున్నారు. మే నుంచి ఇప్పటివరకు అంటే.. 66 రోజుల్లో పెట్రోల్ మీద 35 సార్లు.. డీజిల్ మీద 33 సార్లు ధరల్ని పెంచేశారు. ఇదంతా చూస్తే.. కిమ్మనకుండా బాదేయటంలో మోడీకి.. ఆయన సర్కారుకు డాక్టరేట్ తో ఘనంగా సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మాట రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.