Begin typing your search above and press return to search.

మోడీ అంటే మోసం బీహార్ ప్రచారంలో ఎజెండా

By:  Tupaki Desk   |   27 Oct 2015 4:23 AM GMT
మోడీ అంటే మోసం బీహార్ ప్రచారంలో ఎజెండా
X
ఆయన మాటలు నమ్మి మోసపోయిన ప్రజల ప్రతినిధిని నేను.. ఆయనకు మాటలు చెప్పడమే తప్ప నెరవేర్చడం తెలియదు.. అంటూ బాధితులే స్వయంగా ప్రచారం నిర్వహిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత బలం తప్పకుండా ఉంటుంది. అందుకే రఘువీరారెడ్డి ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. బీహార్ ఎన్నికల బరిలో మోడీ మాటలతో మోసపోయిన తెలుగు ప్రజల ప్రతినిధిగా ఆయన భాజపా వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. రఘువీరారెడ్డి - కేవిపి రామచంద్రరావు - జెడి శీలం తదితరులు ప్రత్యేకంగా కొందరు అనుచరులతో కలిసి బీహార్ వెళ్లి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చోట మోడీ వ్యతిరేక ప్రచారం నిర్వహించడం ఆసక్తికరమే.

ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంలో ప్రధాని నరేంద్రమోదీని మించిన ఘనుడు మరొకరు లేరని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలు తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చే స్వభావం కలిగిన వారు కారు కనుక బిహార్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటెయ్యవద్దంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు అక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీహార్‌ లోని బంకిపూర్‌ లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రధాని మోదీపై మాటమీద నిలబడని మోసగాడిగా ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో మాట్లాడుతూ విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ కు పూర్తి సహాయం చేస్తామని, ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఏపీకి ఇస్తామని వాగ్దానం చేశాడని కానీ నేటివరకు ఆ వాగ్దానాల్లో ఏ ఒక్కటీ మోదీ నెరవేర్చలేదని రఘువీరా ఎద్దేవా చేశారు.

అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌ను అందలమెక్కిస్తామని ఊరించిన మోదీ తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చి తాను ప్రధానమంత్రి అయ్యాడు. ఏపీలో మిత్రపక్షమైన టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఇంతవరకు మోదీ ఆంధ్రప్రదేశ్‌ కు ఒరగపెట్టింది ఏమీ లేదని రఘువీరా ఆరోపించారు. మోదీ ఇప్పుడు బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీని కల్పిస్తామని వాగ్దానం చేశారు కానీ వాటిని నెరవేర్చడానికి బదులుగా నయాగరా జలపాతం నుంచి నీళ్లు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం నుంచి కాసింత మట్టి తీసుకొచ్చి మీ మొహాన కొడతారని రఘువీరా ఆక్షేపించారు.

తోటి సీనియర్ పార్టీ నేతలతో కలిసి బీహార్‌ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న రఘువీరారెడ్డి, ఆంద్రప్రదేశ్‌ కు ఇటీవలే మోదీ చేసిన మరొక మోసాన్ని కూడా అక్కడి ఓటర్లకు తెలియచెప్పారు. దసరా పండుగ నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని మోదీ ఏపీకి ఏవైనా నజరానాలు బహూకరిస్తారని అందరూ ఆశించారు కానీ, మోదీ మాత్రం తాజా ప్రకటనలు హామీలు ఇవ్వడం మాట అంటుంచి గతంలో తాను చేసిన వాగ్దానాల అమలును కూడా తన ప్రసంగంలో పేర్కొనలేదని రఘువీరా ఆరోపించారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడి నలుగుతున్న ఆంద్ర ప్రజల గాయాలపై మోదీ మరింతగా కారం పూసి వెళ్లారని, ప్రధాని మౌనంతో తామంతా షాక్‌ కు గురయ్యామని ఏపీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. కేంద్రంలోనూ బీహార్‌ లోనూ ఒకే సర్కార్ ఉంటే మంచిదని మోదీ చేసిన ప్రకటనను ఏపీ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు.