Begin typing your search above and press return to search.

బాబుకు కొత్త పిచ్చి ప‌ట్టుకుంద‌ట‌

By:  Tupaki Desk   |   30 Oct 2016 2:48 PM IST
బాబుకు కొత్త పిచ్చి ప‌ట్టుకుంద‌ట‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో పెద్ద ఎత్తున భూ సేక‌ర‌ణ చేయ‌డంపై మండిప‌డుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భూమి పిచ్చి ప‌ట్టుకుంద‌ని విమ‌ర్శించిన‌ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఇపుడు పేరు మార్చారు. భూమి పిచ్చి నుంచి మారిపోయి శంకుస్థాపనల పిచ్చి పట్టిందని విమర్శించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో శాసన మండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య - ఉపాధ్యక్షులు తులసిరెడ్డి - శైలజానాథ్ - రుద్రరాజు - జంగా గౌతమ్‌ ల‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ర‌ఘువీరా నూతన రాజధానిలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చేయించిన శంకుస్థాపన నాలుగ‌వ‌ద‌ని ఎద్దేవా చేశారు. జైట్లీని చంద్రబాబు అభినందించడానికి, వెంకయ్య నాయుడు ముఖ్యమంత్రిని పైకి లేపడానికి మాత్రమే సభ నిర్వహించారని, దానికి శంకుస్థాపన అని పేరు పెట్టారని వ్యాఖ్యానించారు. కేవలం శంకుస్థాపనలకే వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ర‌ఘువీరా మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ కు రూ. 2 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తున్నామన్న అరుణ్ జైట్లీ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ర‌ఘువీరా అన్నారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే రాష్ట్రానికి కూడా నిధులు కేటాయిస్తున్నారని, అంతకంటే ప్రత్యేకంగా ఇస్తున్నదేమీ లేదన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికే తమకు అనుకూలంగా ఆర్డినెన్స్ మార్చుకున్నారని రఘువీరా విమర్శించారు. చంద్రబాబులో కేంద్ర మంత్రి వెంకయ్యకు ఏం నచ్చిందేంటో చెప్పాలని శాసన మండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడమా? రైతులకు నష్టం చేసే విధానాలు అవలంబించడమా? ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమా? ప్రజాధనం దుబారా చేయడమా? ఇవేనా చంద్రబాబు నాయుడులో వెంకయ్య నాయుడుకు నచ్చిన అంశాలు? అని నిలదీశారు. టీడీపీ-బీజేపీలు బరితెగించి, బ్రహ్మపదార్ధంలా తయారయ్యాయని, రాబోయే రోజుల్లో ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదని రామ‌చంద్ర‌య్య‌ హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలకు అతీతంగా పోరాటాలతో ప్రత్యేక హోదా సాధించుకుంటామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/