Begin typing your search above and press return to search.

మనవడికి వైఎస్ పేరు పెట్టుకున్నాడట.. రాజుగారి ప్రేమ!

By:  Tupaki Desk   |   10 March 2019 10:21 AM IST
మనవడికి వైఎస్ పేరు పెట్టుకున్నాడట.. రాజుగారి ప్రేమ!
X
ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రఘురామకృష్ణం రాజు ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పారు. నరసాపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్న ఈయన.. నియోజకవర్గంలో ఇప్పటికే పని ప్రారంభించారు. ప్రచారం మొదలుపెట్టేశారు

ఈ సందర్భంగా భీమవరంలో జరిగిన సమావేశంలో రఘురామకృష్ణం రాజు వైఎస్ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యం గురించి వివరించారు. ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకు ఎంతో స్నేహభావం ఉండేదని - తన మనసులో ఇంట్లో ఎప్పుటికీ వైఎస్ ఉంటారని అన్నారు. వైఎస్ తనకు ఎంత అనుబంధం ఉందో వివరించేందుకు మరో విషయాన్ని కూడా చెప్పారాయన. తన మనవడికి రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టినట్టుగా రఘురామకృష్ణం రాజు వివరించారు.

అలా మనవడికి పేరు పెట్టుకునేంత సన్నిహిత సంబంధం వైఎస్ తో ఉండేదని రాజుగారు చెప్పారు. ఇక జగన్ పై కూడా ప్రశంసల వర్షం కురిపించారు రఘురామకృష్ణం రాజు. నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నేత మరొకరు లేరు అని అన్నారు. అందరం కష్టపడి జగన్ ను ముఖ్యమంత్రి చేసుకుంటే.. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాజుగారు అన్నారు.

నరసాపురం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉన్నా ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు రఘురామకృష్ణంరాజు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతోనే ఆయనకు టికెట్ ఖరారు అయ్యింది. వైఎస్ అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేవీపీకి వియ్యంకుడే రఘురామకృష్ణం రాజు అని వేరే చెప్పనక్కర్లేదు.