Begin typing your search above and press return to search.

గులాబీ బ్యాచ్ కు మరో అనుభవాన్ని మిగిల్చిన రఘునందనరావు

By:  Tupaki Desk   |   11 Nov 2020 5:10 PM GMT
గులాబీ బ్యాచ్ కు మరో అనుభవాన్ని మిగిల్చిన రఘునందనరావు
X
దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ అభ్యర్థి రఘనందనరావు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పదే పదే షేర్ అవుతున్నాయి. అలాంటి వీడియోలో ఒకటి.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుర్చీ దిగే పరిస్థితే వస్తే.. అది ఈ రఘునందనరావు వల్ల మాత్రమే. వారికి.. వారి కుటుంబానికి పోటీ ఇచ్చే సత్తా ఎవరికైనా ఉందంటే అది తనకే అంటూ విస్పష్టంగా చెప్పిన ఆయన.. అదే ఇంటర్వ్యూలో.. ఇప్పుడు నేను ఓడిపోవచ్చు.. కానీ ఒక రోజు వస్తుంది..ఆ రోజున తాను చెప్పిన మాటలు నిజమని తెలుస్తుందన్నారు.

అందుకు తగ్గట్లే.. కేసీఆర్ అడ్డాలో వారి సొంతమని చెప్పుకునే సీటులో పోటీ చేయటమే కాదు.. ఏకంగా గెలిచి గులాబీ పార్టీకి గుబులు పుట్టేలా చేశారు. తాజాగా ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు గులాబీ దళానికి కొత్త అనుభవాన్ని ఇవ్వటమే కాదు.. రఘునందనరావు మాటలు వింటే కేసీఆర్ కు సైతం.. ఇంప్రెస్ అయ్యేలా ఉన్నాయని చెప్పక తప్పదు.

యువత సహకారంతో దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించినట్లు చెప్పిన ఆయన.. విద్య నేర్పిన గురువుతోనే పోటీ పడితే బాగుంటుందన్నారు. తాను గురువుగా భావించిన కేసీఆర్ నుంచి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నానని చెప్పారు. దుబ్బాకలో బీజేపీ విజయం దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందన్నారు. పార్టీకి అన్నివిధాలుగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుచెప్పిన ఆయన.. ప్రజాసేవ చేయాలనే తపనతోనే ముఖ్యమంత్రి గడ్డ మీద తనను గెలిపించారన్నారు. ఇదంతా విన్నప్పుడు రఘునందనరావు ఏ మాత్రం అమాయకుడు కాదని.. అతని వ్యవహారం గులాబీ బ్యాచ్ కు సరికొత్త ఫజిల్ గా మారుతుందని చెప్పక తప్పదు.