Begin typing your search above and press return to search.

రాజులకు వేట అంటే మక్కువ... ఏంది రఘురామా ఇవెక్కడి మాటలు?

By:  Tupaki Desk   |   8 Jan 2022 5:05 AM GMT
రాజులకు వేట అంటే మక్కువ... ఏంది రఘురామా ఇవెక్కడి మాటలు?
X
మాటల్లో ఘాటుతనం.. వెనుకా ముందు చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా అనేయటం.. నువ్వు ఒకటంటే.. నేను పది అనేస్తానంటూ విరుచుకుపడే తత్త్త్వం.. వెరసి.. వైసీపీ రెబల్ ఎంపీ రఘరామ రాజు. పొలిటికల్ ‘ఆర్ఆర్ఆర్’ పిలుచుకునే ఆయన.. తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. త్వరలోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని.. అమరావతి రాజధాని ఎజెండాతో ఉప ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పిన ఆయన సంచలనంగా మారారు. ఆయన రాజీనామా అంశంపై ఏపీ సీఎం ముఖ్య సలహాదారు సజ్జల రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. ‘మేం మొదట్నించి అడుగుతున్నది అదే కదా.. రాజీనామా చేయమనే కదా? నచ్చనప్పుడు బయటకు వెళ్లినప్పుడు రాజీనామా చేయాల్సింది కదా? అదే కదా అడిగింది? చేసి ఉండాల్సింది. అందులో చాలెంజ్ ఏముంది?’ అంటూ తేల్చేసిన వైనంపై రఘురామ మరింతగా చెలరేగిపోయారు.

తనను రాజీనామా చేయాలని ఎవరు అడగలేదన్నారు రఘురామ. ‘నన్ను రాజీనామా చేయమని ఎవరు అడిగారు? దారిన పోయే పనికి మాలిన కొంతమంది వెధవలతో మాట్లాడించారు. నన్ను రాజీనామా చేయమని సకల శాఖా మంత్రి అయిన సజ్జల రామక్రిష్ణా రెడ్డి అడిగాడా? ఏడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అడిగారా? ఫస్ట్ క్లాస్ స్టూడెంటు? లేదంటే.. విజయసాయి రెడ్డి అడిగారా? ఏ రెడ్డి అడిగాడు? దారిన పోయే ఆ రెడ్డి.. ఈ రెడ్డి తప్పా.. ఏ పెద్ద రెడ్డి అడిగాడు నన్ను?’’ అంటూ విరుచుకుపడ్డారు.

వీళ్లందరూ ఒక బేవార్సు విమానం వేసుకొని వెళ్లి.. స్పీకర్ గారిని కలిసి లెటర్ల మీద లెటర్లు ఇస్తున్నారు. దీంతో..దాన్నో ఛాలెంజ్ గా తీసుకున్నా. వాళ్లు ఆ ప్రయత్నం చేస్తూ.. రెండు నెలలకు ఒకసారి.. ఇదిగో అయిపోతోంది. అదిగో అయిపోతుందని చెబుతూ.. ఎన్నో కోట్లు కూడా ఖర్చు పెట్టారని మార్కెట్లో రూమర్లు ఉన్నాయి. రాజులకు వేటంటే మక్కువ. ఏదో చూస్తున్నారు కదా? ఏదో ట్రై చేస్తున్నారు కదా? చూద్దాం ఈ వెధవ నాటకాలు చూద్దామని చూస్తున్నా. ఓపక్క వాళ్లు ప్రయత్నాలు చేస్తుంటే.. నేనెందుకు రాజీనామా చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి.. ఆయనకు వచ్చిన భాషలో అన్నా.. మంషో సెడ్డో.. నీకు సీటిచ్చా.. రాజీనామా చేసేయ్ అంటే చేసేవాడ్ని’’ అని పేర్కొన్నారు.

మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. అవసరానికి మించి కులం ప్రస్తావన తీసుకురావటం విజయరామరాజుకు ఏ మాత్రం సరికాదని చెప్పాలి. ఇప్పటికి ఏపీ అంటేనే.. కుల రాజకీయాల వెగటు వాసన ముక్కు పుటాల్ని అదరగొట్టేస్తుంటుంది. అలాంటి రఘరామపుణ్యమా అని ఆయన నోరు తెరిస్తే.. చాలు.. కుల ప్రస్తావన అదే పనిగా తీసుకొస్తూ చిరాకు తెప్పించేస్తుంటారు. అది సరిపోదన్నట్లు.. ఇదేదో రెడ్డి వర్సెస్ రాజు అన్న తరహాలో పిక్చర్ ఇవ్వాల్సినంత సీన్ లేదు. రెడ్ల పేరుతో నోటికి వచ్చినట్లుగా అనేయటం.. రాజు పేరుతో.. వేట మక్కువ అంటూ మాట్లాడటం లాంటివి అంత సరైనవి కావన్న విషయాన్ని రఘురామ ఎంత త్వరగా గుర్తిస్తే మంచిది. రాజకీయాలు ఇప్పటికి నాశనమైంది చాలు.. మరింత నాశనం కావాల్సిన అవసరం లేదన్నది రాజకీయ ఆర్ఆర్ఆర్ గుర్తిస్తే మంచిది.