Begin typing your search above and press return to search.

ఆర్టికల్ 360 ప్రయోగించాలట

By:  Tupaki Desk   |   10 Aug 2021 4:43 AM GMT
ఆర్టికల్ 360 ప్రయోగించాలట
X
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎంత కసుందో తెలిసిపోతోంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని కూల్చేయాలని లేదా జగన్ను జైలుకు పంపాలనే కసితో 24 గంటలూ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలని, ఆర్టికల్ 360 విధించాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆర్టికల్ 360 విధించటం ఎందుకయ్యా అంటే జీఎస్డీపీలో అప్పులు 41 శాతం మించిపోయాయట. ఉద్యోగులకు జీతాలు, ఫించన్లు కూడా చెల్లించలేని స్ధితిలో ప్రభుత్వ ఆర్ధికపరిస్ధితి కూరుకుపోయిందట.

తిరుగుబాటు ఎంపి చెప్పింది నిజమే అనుకుందాం. అప్పుల్లో కూరుకుపోని రాష్ట్రం దేశంమొత్తం మీద ఏదైనా ఉందేమో ఎంపి చూపిస్తే బాగుంటుంది. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర పగ్గాలు తీసుకున్న జగన్ మళ్ళీ అప్పులు చేయక ఏమిచేస్తారు ? ఏపికన్నా మించి అప్పులు చేసిన రాష్ట్రాలు దేశంలో చాలాఉన్నాయన్న విషయాన్ని ఎంపి మరచిపోయినట్లున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాలు అప్పుల్లోనే నెట్టుకొస్తున్నాయి.

రాష్ట్రాల సంగతి ఇలాగుంటే స్వయంగా కేంద్రప్రభుత్వమే పరిమితికి మించి అప్పులు చేస్తోంది. కరోనా వైరస్ నేపధ్యంలో కేంద్రం కూడా రు.11 లక్షల కోట్లు అప్పులు చేసింది. కేంద్రం మొత్తం అప్పులు రు. 120 లక్షల కోట్లు. నిధుల కోసమని ప్రభుత్వ రంగసంస్ధలనే అమ్మేస్తోంది. రాష్ట్రాల అప్పులు పెరిగిపోవటానికి కరోనా వైరస్ తీవ్రత కూడా ప్రధాన కారణమే. ఈ ఖర్చులను తట్టుకోవటానికి చాలామంది ముఖ్యమంత్రుల్లాగానే జగన్ కూడా తనకు అందుబాటులో ఉన్న మార్గాల్లో అప్పులు తెచ్చుకున్నది వాస్తవం.

చంద్రబాబునాయుడు కూడా అనేక మార్గాల్లో అప్పులు చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాంటి ఆస్తులను కుదవపెట్టి అప్పులు తెచ్చారు. ప్రభుత్వం అన్నాక ఇవన్నీ సహజమే. అప్పులు చేయటం, వడ్డీలు కట్టడం, మళ్ళీ కొత్త అప్పులు చేయటం అత్యంత సహజం. తిరుగుబాటు ఎంపి చెప్పినట్లు పరిమితికి మించి అప్పుల వల్లే ఆర్టికల్ 360 విధించాలంటే అన్నీ రాష్ట్రాల్లోను విధించాల్సిందే. ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలూ ఉంటాయి, నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలూ ఉంటాయని కేంద్రానికి తెలీదా.

జగన్-రఘురామ మధ్య వ్యక్తిగత వివాదాలు పెరిగిపోయిన కారణంగానే ప్రభుత్వంపై ఎంపి నోటికొచ్చినట్లు మాట్లాడుతు, ఇష్టం వచ్చినట్లు లేఖలు రాస్తున్నారు. ఎంపిపై అనర్హత వేటు వేయించాలనే డిమాండ్ తో పాటు ఎంపిపైనున్న మనీల్యాండరింగ్, హవాలా ఆరోపణలపై విచారణ చేయించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అనేక కారణాల వల్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపి రెచ్చిపోతున్నారు. మరి దీనికి ఫలుస్టాప్ ఎప్పుడు పడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.