Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు మంత్రుల పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్‌

By:  Tupaki Desk   |   13 Jun 2017 5:54 AM GMT
ఆ ఇద్ద‌రు మంత్రుల పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్‌
X
బీహార్ మాజీ ముఖ్యమంత్రి - ఆర్‌జెడీ అధినేత లాలూప్రసాద్ యాద‌వ్ మాట‌తీరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌న‌సులో ఉన్న‌ది కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్లు చెప్పేయ‌డం లాలూ స్టైల్‌. లాలూ భార్య - మాజీ ముఖ్య‌మంత్రి రబ్రీదేవి కూడా అక్షరాలా ఇదే పద్ధతి పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నంగా మారాయి. బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తన ఇద్దరు కుమారులు తేజ్‌ ప్రతాప్ యాదవ్ - తేజస్వి ప్రసాద్ యాదవ్‌ లకు ఎలాంటి అమ్మాయిలు భార్యలుగా రావాలని కోరుకుంటున్నారో ఆమె బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు.

లాలూప్రసాద్ 70వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ర‌బ్రీదేవిని పాత్రికేయులు ఓ ప్ర‌శ్న అడిగారు. మంత్రులుగా ఉన్న‌ప్ప‌టికీ తేజ్‌ ప్ర‌తాప్‌ - తేజ‌స్వియాద‌వ్‌ కు ఇంకా వివాహం కాలేదు. ఈ నేప‌థ్యంలో ``మీ ఇద్దరు కుమారులకు ఎలాంటివాళ్లు భార్యలుగా రావాలనుకుంటున్నారు`` అని ర‌బ్రీదేవిని ప్రశ్నించగా, ``సినిమా హాళ్లకు వెళ్లేవాళ్లు, షాపింగ్ మాల్స్ చుట్టూ తిరిగేవాళ్లు నా కొడుకులకు భార్య‌లుగా అక్కర్లేదు. నా లాగా పెద్దవాళ్లను గౌరవించే, ఇంటిపట్టునే ఉండే ‘సంప్రదాయక’ అమ్మాయిలే కావాలి’`` అని ర‌బ్రీదేవి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తమ కుమారులకు వివాహం చేయ‌డం కోసం తాము ఎంద‌రో అమ్మాయిల ఫోటోలను చూశామని, అయితే వాళ్లలో చాలామంది తనకు నచ్చలేదని, అందుకే వాటిని తన కొడుకులకు కూడా చూపించలేదని రబ్రీ దేవి చెప్పారు. సంప్ర‌దాయానికి పెద్ద పీట వేసే త‌మ కుటుంబంలో అలా ఉండే అమ్మాయిలే కోడ‌లుగా కావాల‌ని స్ప‌ష్టం చేశారు.

మాజీ ముఖ్య‌మంత్రి అయిన ర‌బ్రీదేవి చేసిన కామెంట్ల గురించి ఆమె కుమారులయిన మంత్రులను అడగ్గా వారు మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు. తమకు ఎలాంటి కోడళ్లు కావాలో తమ తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుంటారని, వారి నిర్ణ‌యాల‌నే తాము పాటిస్తామ‌ని మంత్రులు తేజ్‌ ప్రతాప్ యాదవ్ - తేజస్వి ప్రసాద్ యాదవ్ మాధానం చెప్పడం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/