Begin typing your search above and press return to search.

మాజీ సీఎం పై మరోసారి ఫిర్యాదు చేసిన కోడలు !

By:  Tupaki Desk   |   16 Dec 2019 8:23 AM GMT
మాజీ సీఎం పై మరోసారి ఫిర్యాదు చేసిన కోడలు !
X
ప్రతి ఇంట్లో అత్తా - కోడళ్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొందరి ఇళ్లల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే ..కొన్ని ఇళ్లల్లో మాత్రం ఆ గొడవలు కోర్టు మెట్లు ఎక్కే వరకు కూడా పోతుంటాయి. ఇలాంటి గొడవలు అందరికి సర్వసాధారణమే. తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆదివారం హైడ్రామా చోటుచేసుకుంది. ఏమైంది అంటే .?

గతంలో ఒకసారి మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి కోడలు అయిన ఐశ్వర్యారాయ్ తన అత్తింటి బాడీగార్డులు తనను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన అత్త అయిన మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి తన జుట్టు పట్టుకొని కొట్టి, ఇంటి నుంచి బయటకు వెళ్ల గొట్టిందని ఐశ్వర్యారాయ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్ పాట్నా నగరంలోని సచివాలయ పోలీసు స్టేషను కు వచ్చి అత్త పై ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ గరీమా మాలిక్ రంగంలోకి దిగి - అత్త దాడిపై కేసు నమోదు చేసి - గాయపడిన ఐశ్వర్యారాయ్‌ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

'పాట్నా నగరంలోని మాజీ సీఎం నివాసగృహమైన 10 సర్కులర్ రోడ్డు ఇంట్లో అత్త రబ్రీదేవీ నా జుట్టు పట్టుకొని కొట్టి బాడీగార్డుల సాయంతో నన్ను ఇంటి నుంచి బయటకు గెంటివేసింది' అని ఐశ్వర్యారాయ్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటన అనంతరం ఐశ్వర్యారాయ్ తండ్రి - ఎమ్మెల్యే అయిన చంద్రికారాయ్ రబ్రీదేవి ఇంటికి హుటాహుటిన వచ్చారు. సచివాలయ పోలీసులు రబ్రీదేవి ఇంటికి వెళ్లి సంఘటన గురించి ఆరా తీశారు.

ఇకపోతే ఐశ్వర్యారాయ్ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పెళ్లాడారు. గతంలో జరిగిన గొడవల నేపథ్యంలో తన భార్య ఐశ్వర్యారాయ్ తో విడాకులు కోరుతూ తేజ్ ప్రతాప్ 2018 నవంబరులో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కోర్టు విచారణలో ఉంది. కాగా, ఈ వ్యవహారం పై తేజస్వీప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ .... తన రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కేసులు పెట్టిస్తున్నారని ఆదివారం అర్దరాత్రి ఆరోపించారు.