Begin typing your search above and press return to search.

ఆ మాజీ లేడీ సీఎం నోట మొరటు మాటలు

By:  Tupaki Desk   |   30 Nov 2016 6:44 AM GMT
ఆ మాజీ లేడీ సీఎం నోట మొరటు మాటలు
X
ఎలాంటి అర్హత లేకున్నా ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అవకాశం భారత్ లో మాత్రమే ఉంటుందన్న విషయం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు తేలిపోయింది. ప్రజాభిమానం లేకున్నా.. ఆమె ఎవరన్న విషయంపై పెద్దగా అవగాహన లేకున్నా.. అధినేత తీసుకున్న నిర్ణయానికి తలూపేసిన వైనంతో ఆమె బీహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అదంతా గతం. ఆ తర్వాత కాలంలో ఆమె పెద్దగా వార్తల్లోకి రాలేదనే చెప్పాలి.

తాజాగా ఊహించని విధంగా ఆమె నోటి నుంచి వచ్చిన మొరటు మాటలతో ఆమె వార్తల్లోకి వచ్చేశారు. పెద్దనోట్ల రద్దు ఎపిసోడ్ లో ఆర్జేడీతో చెట్టాపట్టాలేసుకున్న బీహార్ ముఖ్యమంత్రి.. జేడీయూకు చెందిన నితీశ్ కుమార్ సానుకూలంగా ఉండటం ఆర్జేడీ పరివారానికి ఏ మాత్రం నచ్చటం లేదు. ఇదిలా ఉంటే.. మరోవైపు నితీశ్ కుమార్ పై బీహార్ కు చెందిన బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ సానుకూల వ్యాఖ్యలు చేస్తూ.. ఆర్జేడీతో ఉన్న బంధం కారణంగా ఆయన స్వేచ్ఛగా.. స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారన్న వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిన తర్వాత.. ఆ నిర్ణయం నచ్చక ఎన్డీయేతో నితీశ్ కటీఫ్ చెప్పేయటం తెలిసిందే. అప్పటి నుంచి ఎన్డీయేతో దూరంగా ఉంటూ.. మోడీ అంటేనే మండిపడే నితీశ్.. తాజా రద్దు ఎపిసోడ్ లో మాత్రం ఆయన నిర్ణయాన్ని సమర్థించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీశ్ కు మరింత దగ్గరయ్యేందుకు బీహార్ కమలనాథులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. ఆర్జేడీని టార్గెట్ చేశారు.

ఈ పరిణామం సహజంగానే లాలూ పరివారానికి మంటపుట్టా చేసింది. నితీశ్ గురించి బీజేపీ నేత సుశీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలంటూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి.. లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవిని కోరారు. అప్పటివరకూ మనసులో ఉన్న ఉక్రోషమో.. సుశీల్ కుమార్ మోడీ మీద ఉన్న ఆగ్రహమో కానీ ఆమె నోట ఎవరూ ఊహించని రీతిలో సమాధానం వచ్చింది.

నితీశ్ ను చూసి సుశీ కు మరీ అంత బాధ అనిపిస్తే తన సోదరిని ఇచ్చి పెళ్లి చేసి ఇంటికి తీసుకెళ్లి ఒళ్లో కూర్చోబెట్టుకోవచ్చంటూ పరుషంగా మాట్లాడారు. ఇలాంటి మాటలు ఏ మాత్రం ఊహించని నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రముఖంగా వచ్చేశాయి. దీంతో.. ఇదో వివాదంగా మారింది. జరిగిన డ్యామేజీని అర్థం చేసుకున్న రబ్రీ దేవి తన మాటల్నిసమర్థించుకుంటూ.. నష్టనివారణ చర్యలు చేపట్టారు. సుశీల్ కుమార్ మోడీ తనకు మరిది లాంటి వాడినని.. తాను ఆయనకు సోదరినినని.. మరిదితో వదిన ఆ మాత్రం పరాచికాలు ఆడకూడదా? అంటూ గడుసుగా ప్రశ్నిస్తున్నారు. ఏమైన రబ్రీ దేవి నోటి నుంచి వచ్చిన మొరటు మాటలు రాజకీయంగా పెద్ద చర్చనే రేపుతున్నట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/