Begin typing your search above and press return to search.

జైల్లో కలుసుకున్న ఇద్దరు సీఎంలు

By:  Tupaki Desk   |   23 Jun 2015 10:02 AM GMT
జైల్లో కలుసుకున్న ఇద్దరు సీఎంలు
X
ఈ మధ్య కాలంలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఒకరిని మించిన ఎత్తులు ఇంకొకరు వేసుకోవడం..అంచనాలకు అందని వారు కూడా అందలానికి వెళ్లడం...ఆకాశానికి నిచ్చెన వేసిన వారు అవని దగ్గరే ఆగిపోవడం...ఇలా పాలిటిక్స్‌ పసందుగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో ఓటుకునోటు కేసు తెరమీదకు రావడం తెలుగు రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేపింది. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి రాజకీయాల్లో ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.

జైల్లో ఉన్న రేవంత్‌ రెడ్డిని టీడీపీకే చెందిన ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ములాఖత్‌లో కలుసుకొని దాదాపు గంట సేపు ముచ్చటించారు. రేవంత్‌ ఆరోగ్య పరిస్థితిని, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే రేవంత్‌ ను ఆర్‌.కృష్ణయ్య కలవడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినప్పటికీ ఎన్నికల తర్వాత ఆర్‌.కృష్ణయ్య ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గనలేదు. పైపెచ్చు కొన్ని సందర్భాల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా విమర్శలు కూడా చేశారు. అలాంటిది రేవంత్‌ రెడ్డిని కలవడం, అది కూడా జైలుకు వెళ్లి మరీ ములాఖత్‌ అవడం ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలోనే పలువురు రాజకీయ విశ్లేషకులు వీరిద్దరి భేటీపై సరదాగా జోకులు పేలుస్తున్నారు. ఎప్పటికైనా సీఎం అవుతానని గతంలో రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్నికల సమయంలో తమ పార్టీ సీఎం అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య అని చంద్రబాబు కూడా ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజా ఎపిసోడ్‌ ఈ ''సీఎం''లు ఇద్దరు జైల్లో కలుసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ వాళ్లేం మాట్లాడుకున్నారు? తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనేదే వారిద్దరి చర్చల సారాంశమా అంటూ....ఎకసెక్కాలు ఆడుతున్నారు.