Begin typing your search above and press return to search.

జ‌డ్జిల అస‌హ‌నం ..రాహుల్ అత్య‌వ‌స‌ర మీటింగ్‌

By:  Tupaki Desk   |   12 Jan 2018 4:08 PM GMT
జ‌డ్జిల అస‌హ‌నం ..రాహుల్ అత్య‌వ‌స‌ర మీటింగ్‌
X
సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు నలుగురు ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీజేఐ దీపక్ మిశ్రాపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ‘న్యాయ సంక్షోభం’ తలెత్తిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తమ పార్టీ న్యాయవాదులు వెల్లడించిన అంశాలు - పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసంలో పలువురు సీనియర్ నేతలు సమావేశమయ్యారు. పార్టీ ముఖ్యనేత‌లు అహ్మద్ పటేల్ - సల్మాన్ ఖుర్షీద్ - మనీష్ తివారీ - చిదంబరం తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మీడియా ముందుకు ఆ పార్టీ నేతలు రానున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యవసర భేటీ నిర్వహించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలాఉండ‌గా...నలుగురు సిటింగ్ జడ్జిల తీరును కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి - బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సమర్ధించారు. న్యాయమూర్తులను విమర్శించే బదులు - వారు లేవనెత్తిన అంశాలపై అంతా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని యశ్వంత్ సిన్హా ఓ ట్వీట్‌ లో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అసాధారణ విషయమే. జాతి ప్రయోజనాలు ప్రమాదంలో పడ్డాయని అనుకున్నప్పుడు సాధారణ నియమ నిబంధనలు ఏవీ వర్తించవు’ అని సిన్హా అన్నారు. కాగా, చీఫ్ జ‌స్టిస్ కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌టంపై ప్ర‌ముఖ మ‌హిళా న్యాయ‌వాది ఇందిరా జైసింగ్ స‌మ‌ర్థించారు. బయటకు వచ్చిన న్యాయమూర్తులు చీఫ్‌ జస్టిస్‌ కు వ్యతిరేకులు కాదనీ - కానీ కొల్లీజియంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే హక్కు భారత ప్రజలకు ఉంటుందన్నారు. సుప్రీం చీఫ్ పై న‌లుగురు న్యాయ‌మూర్తులు చేసిన ఫిర్యాదును చూసి షాక్ కు గుర‌య్యాన‌ని కాంగ్రెస్ నేత - సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. దీనిపై అంతిమంగా కోర్టు నిర్ణ‌యం తీసుకుటుంద‌ని చెప్పారు. న్యాయమూర్తులు తమలో తాము సమస్యలను పరిష్కరించుకొని వుంటే బావుండేదని అన్నారు.

ఇదిలాఉండ‌గా....సీజేఐ దీపక్ మిశ్రాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జస్టిస్‌ చలమేశ్వర్‌ సహా నలుగురు సిట్టింగ్ జడ్జిలు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అనంత‌రం చలమేశ్వర్‌ ను సీపీఐ నేత‌ - ఎంపీ డి.రాజా కలుసుకున్నారు. ఈ భేటీ ప్రాధాన్యత‌ను సంతరించుకుంది.ఇంత హ‌డావుడిగా చలమేశ్వర్‌ ను డి.రాజా కలుసుకోవడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే చలమేశ్వర్‌ ను తాను కలుసుకున్న విషయాన్ని డి.రాజా ధ్రువీకరించారు. జస్టిస్ చలమేశ్వర్ తనకు చాలా కాలంగా తెలుసునని, ఆయన ఎందుకు అంత ఆవేదనకు లోనయ్యారో తెలుసుకోవాలనుకున్నట్టు చెప్పారు.

కాగా, న్యాయవ్యవస్థకు ఇదొక దుర్దినమ‌ని బీజేపీ నేత‌ - సీనియ‌ర్ న్యాయ‌వాది సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి వ్యాఖ్యానించారు. న్యాయ‌మూర్తుల‌ను విమ‌ర్శించ‌లేమ‌ని, గొప్ప సమగ్రత గల వ్యక్తులు - చట్టపరమైన వృత్తిని త్యాగం చేశారంటూ న్యాయమూర్తుల పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు. కాగా, సుప్రీంకోర్టు జడ్జిల పట్ల తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు సీనియ‌ర్ న్యాయ‌వాది ప్రశాంత్ భూషణ్ . సుప్రీం చీఫ్‌ దీపక్‌ మిశ్రా చాలా ఘోరంగా తన అధికారాలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక ఫలితాలను సాధించడానికి ‘రోస్టర్ ఆఫ్‌ మాస్టర్’ గా తన పవర్‌ ను వాడుకున్నారని విమర్శించారు. ఏ మాత్రం బాధ్యత ఉన్నా చీఫ్ జస్టిస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.