Begin typing your search above and press return to search.

అసలుసిసలు 'రాణి' ఇకలేరు.. స్కాట్లాండ్ లో తుదిశ్వాస విడిచిన క్వీన్ ఎలిజబెత్ 2

By:  Tupaki Desk   |   9 Sep 2022 1:05 AM GMT
అసలుసిసలు రాణి ఇకలేరు.. స్కాట్లాండ్ లో తుదిశ్వాస విడిచిన క్వీన్ ఎలిజబెత్ 2
X
పాతికేళ్ల వయసులో అగ్రరాజ్యానికి రాణిగా మారి.. ఏకంగా 70 ఏళ్ల పాటు అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన బ్రిటన్ ను పాలించిన అసలుసిసలు మహరాణి ఎలిజబెత్ 2 (96) ఇక లేరు. గురువారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఇటీవల స్కాట్లాండ్ వెళ్లి.. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న ఆమె గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లుగా బకింగ్ హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. రాణి ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్నంతనే సన్నిహిత రాజ కుటుంబీకులంతా ఉదయమే స్కాట్లాండ్ లోని బల్మోరల్ కు చేరుకున్నారు.

క్వీన్ ఎలిజబెత్ 2 మరణవార్త విన్నంతనే లండన్ వాసులు.. పర్యాటకులు బకింగ్ హామ్ ప్యాలెస్ వద్దకు చేరుకున్నారు. గడిచిన ఏడాది ఆక్టోబర్ నుంచి ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. వయో సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె.. దైనందిన కార్యక్రమాల్ని కూడా సరిగా నిర్వహించలేకపోతున్న పరిస్థితి. ఈ కారణంతోనే ప్రయాణాల్ని పూర్తిగా తగ్గించుకున్న ఆమె.. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ నియామకాన్ని కూడా బల్మోరల్ కోట నుంచే చేపట్టిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ సలహాదారులతో బుధవారం వర్చువల్ గా ప్రీవీ కౌన్సిల్ సమావేశం ఆఖరి నిమిషంలో వాయిదా పడటంతో ఆమె ఆరోగ్యం మీద అనుమానాలు మొదలయ్యాయి. రాణి ఆరోగ్యాన్ని వైద్యుల టీం దగ్గరుండి పరిశీలిస్తుందని బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. ఆమె ఆరోగ్యం విషమించిందన్న సమాచారాన్ని అందుకున్నంతనే.. కుమారుడు ప్రిన్స్ చార్లెస్.. కెమిల్లా దంపతులు, కుమార్తె ప్రిన్సెస్ అన్నె.. మనమడు ప్రిన్స్ విలియమ్స్.. యూకేలోనే ఉన్న హ్యారీ దంపతులు కూడా బల్మోరల్ వెళ్లారు.

ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ తన ఇతర ప్రోగ్రాంలన్నింటిని రద్దు చేసి మహరాణికి సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తుండటం గమనార్హం. ఎలిజబెత్ 2 ఆరోగ్యం విషమంగా ఉందన్న విషయం తెలిసినంతనే పార్లమెంటులో ఇంధన బిల్లులపై జరుగుతున్న చర్చను హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ లిండ్సే హోలె నిలిపేశారు. క్వీన్ ఎలిజబెత్ తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో ఆమె స్థానంలో కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా.. పద్నాలుగు కామన్ వెల్త్ దేశాల అధినేతగా సంతాప కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. రాణి మరణవార్త నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ మీడియాతో మాట్లాడుతూ.. క్వీన్ కృషితోనే బ్రిటన్ గొప్ప దేశంగా ఎదిగిందని.. ఆమె అంకిత భావం మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

రాణి ఎలిజబెత్ 2 మరణం నేపథ్యంలో 'ఆపరేషన్ లండన్ బ్రిడ్జి' పేరుతో తదనంతర కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్త రాజుగా ప్రిన్స్ చార్లెస్ బాధ్యతలు స్వీకరిస్తారు. యూకేలో జాతీయ పతాకాలను అవనతనం చేశారు.పార్లమెంటు వ్యవహారాల్ని 10 రోజుల పాటు రద్దు చేసి.. జాతీయ సంతాప దినాలుగా ప్రకటిస్తారు. రాణి భౌతికకాయాన్ని బకింగ్ హోమ్ ప్యాలెస్ లోని థ్రోన్ రూమ్ కు తరలించి..ఐదు రోజుల పాటు అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత వెస్ట్ మినిస్టర్ హాల్ కు చేర్చి అక్కడ మూడు రోజులు ఉంచుతారు.

రాణికి నివాళులు అర్పించేందుకు వీలుగా రోజుకు 23 గంటల పాటు సాధారణ ప్రజలకు అనుమతి ఇస్తారు. పదోరోజున లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బే చర్చిలో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు నిర్వహిస్తారు. క్వీన్ ఎలిజబెత్ మరణం నేపథ్యంలో ఆమెతో 2015, 2018లో జరిగిన సమవేశాల్ని గుర్తు చేసుకున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. తన సంతాపాన్ని ఆయన ట్వీట్ తో పోస్టు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.