Begin typing your search above and press return to search.

పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..మహేశ్ బిగాల ఆన్ లైన్ ఉద్యమం

By:  Tupaki Desk   |   23 Oct 2020 5:02 PM GMT
పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..మహేశ్ బిగాల  ఆన్ లైన్ ఉద్యమం
X
తెలుగు జాతి గర్వించదగ్గ భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం చేయగా... పీవీ శతజయంతి ఉత్సవాలు భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ పెద్ద ఎత్తున మొదలైపోయాయి. ఈ సందర్భంగా పీవీ సెంటినరీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కన్వీనర్ మహేశ్ బిగాల... పీవీకి భారతరత్నను సాధించే దిశగా ఏకంగా ఆన్ లైన్ లో ఓ పెద్ద ఉద్యమాన్నే మొదలెట్టేశారు. https://www.change.org/BharatRatnaforPV పేరిట ఆన్ లైన్ లో ఏర్పాటు చేసిన లింకులో ఓటేయాలంటూ మహేశ్ బిగాల విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ... పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రపంచంలోని 50 దేశాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పీవీ సెంటినరీ కమిటీ పిలుపు మేరకు ఆయా దేశాల్లో పీవీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, మారిషస్ దేశాల్లో పీవీ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికాలో ఆ దేశ రాజధాని వాషింగ్టన్ డీసీతో పాటు పలు ప్రధాన నగరాల్లోనూ పీవీ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో వచ్చే ఏడాది పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాలకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను ముఖ్య అతిధిగా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో పాటుగా పీవీకి భారతరత్న వచ్చేలా ఆన్ లైన్ ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లుగా మహేశ్ బిగాల చెప్పారు. https://www.change.org/BharatRatnaforPV పేరిట తాను దాఖలు చేసిన పిటిషన్ కు యావత్తు తెలుగు ప్రజలు ఓటేసి... పీవీకి భారతరత్న ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ వేత్తగానే కాకుండా బహుముఖ ప్రజ్ఝాశాలి అయిన పీవీకి భారతరత్నను సాధించే దాకా ఈ ఉద్యమాన్ని కొనసాగించనున్నట్లు మహేశ్ బిగాల పేర్కొన్నారు. మొత్తంగా పీవీకి భారతరత్నను సాధించే దిశగా ఓ పెద్ద ఉద్యమమే మొదలైందని చెప్పక తప్పదు.