Begin typing your search above and press return to search.

టీటీడీ బోర్డుతో టీడీపీ నేత రాజకీయం.. జగన్ ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   28 May 2019 11:25 AM GMT
టీటీడీ బోర్డుతో టీడీపీ నేత రాజకీయం.. జగన్ ఏం చేస్తారు?
X
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో చాలా మంది నామినేటెడ్ పోస్టుల్లోని వారు రాజీనామాల బాట పట్టారు. ఇప్పటికే బోలెడన్ని నామినేటెడ్ పోస్టులకు రాజీనామా పత్రాలు అధికారులకు అందాయి. చంద్రబాబు నాయుడి ప్రాపకంతో ఆ పదవులు పొందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటూ వస్తున్నారు. మరి అదే పరంపరలో రాజీనామా చేయాల్సిన టీటీడీ బోర్డు మాత్రం అడ్డం తిరుగుతూ ఉంది.

ప్రపంచంలోనే హిందువులకు అత్యంత పవిత్రమైన, అత్యంత పెద్ద హైందవ ధర్మ సంస్థ అయిన టీటీడీ బోర్డులో ఇప్పుడు రాజకీయం సాగుతూ ఉంది. టీటీడీ బోర్డుకు తాము రాజీనామా చేసేది లేదంటూ తెలుగుదేశం నేత సుధాకర్ యాదవ్ సవాల్ విసురుతూ ఉన్నారు. దమ్ముంటే బోర్డును రద్దు చేయమంటూ ఆయన వివాదాన్ని రేపారు. టీటీడీ బోర్డును రద్దు చేయడం ప్రభుత్వానికి పెద్ద విషయం ఏమీ కాదు. అయితే అలాంటి వ్యవహారాలు సాఫీగా సాగిపోవాలని ఏ ప్రభుత్వం అయినా కోరుకుంటుంది. ఇది వరకూ ప్రభుత్వాలు మారినప్పుడు చైర్మన్లు కామ్ గా రాజీనామాలు ఇచ్చి తప్పుకున్నారు.

అయితే పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం కొత్త ప్రభుత్వానికి సవాల్ విసిరేస్తున్నారు. తామంతట తాము రాజీనామా చేసేది ఉండదని, ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తే తప్ప తాము తప్పుకోమని ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. ఈ రోజు ఆయన బోర్డు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే అధికారులు ఆ సమావేశానికి హాజరైనా బోర్డు ఆదేశాలను పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు.

దీంతో సుధాకర్ యాదవ్, బోర్డు సభ్యులు వారి మీద కూడా విమర్శలు ప్రారంభించారు. బోర్డు సభ్యుల్లో ఒకరు అధికారుల పై అనుచితంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి మాట్లాడుతూ.. టీటీడీ బోర్డును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్వీబీసీకి రాఘవేంద్రరావు రాజీనామా చేయడం సరైన పని అని, అలాగే బోర్డు సభ్యులు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కుదరని పక్షంలో బోర్డును రద్దు చేయాలని ఆయన కోరారు. అది జరగాలంటే.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కావాల్సి ఉంటుంది.