Begin typing your search above and press return to search.

రాయ‌పాటి క‌ల‌ను ఎత్తుకెళ్ల‌నున్న పుట్టా

By:  Tupaki Desk   |   28 Sep 2017 5:13 AM GMT
రాయ‌పాటి క‌ల‌ను ఎత్తుకెళ్ల‌నున్న పుట్టా
X
కొంద‌రు నేత‌ల‌కు కొన్ని క‌ల‌లు ఉంటాయి. అదేం చిత్ర‌మో కానీ ప్ర‌జాభిమానం.. రాజ‌కీయ ప‌లుకుబ‌డి అన్ని ఉన్నా వారి క‌ల మాత్రం నెర‌వేర‌దు. ఎంపీగా ప‌లుమార్లు గెలిచిన ఏపీకి చెందిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అన్న వెంట‌నే తెలుగు ప్ర‌జ‌లు ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. వ్యాపార‌వేత్త‌గా సుప‌రిచితుడు.. రాజ‌కీయ నేత‌గా అంద‌రికి తెలిసిన ఆయ‌న‌కు తీర‌ని కోరిక ఒక‌టి ఉంది.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డుకు ఛైర్మ‌న్ గా ఉండాల‌న్న‌ది ఆయ‌న అభిలాష‌. ఆ విష‌యాన్ని ఆయ‌న మ‌న‌సులోనే దాచి పెట్టుకోకుండా ఇప్ప‌టికే ప‌లుమార్లు బ‌య‌ట‌కు చెప్పుకున్నారు. అంతేనా.. త‌న‌కు కానీ టీడీడీ బోర్డు ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇస్తే.. భ‌విష్య‌త్తులో ఇంకే ప‌ద‌విని అడ‌గ‌న‌ని కూడా చెప్పారు. అయినా ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ద‌క్క‌ని ప‌రిస్థితి. గ‌తంలో కాంగ్రెస్ స‌ర్కారు ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు ఆయ‌న ఆ పార్టీలో నే ఉన్నా టీటీడీ ఛైర్మ‌న్ గిరి ద‌క్క‌లేదు.

విభ‌జ‌న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రాయ‌పాటి 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. ఎంపీ ప‌ద‌వి ద‌క్కినా ఆయ‌న‌కు సంతృప్తి లేదు. త‌న‌కు తీర‌ని కోరిక‌గా మారిన టీటీడీ బోర్డు ఛైర్మ‌న్ ప‌ద‌విని త‌న‌కు అప్ప‌గించాల‌ని ఆయ‌న ప‌లుమార్లు కోరారు.

గ‌తంలో ఇచ్చిన మాట‌ను వెన‌క్కి తీసుకోలేని ప‌రిస్థితుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తికి టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని అప్ప‌గించారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగిసి చాలా కాలం అయ్యాక కూడా.. ఆయ‌న స్థానంలో మ‌రొకరిని ఎంపిక చేయ‌కుండా కాల‌యాప‌న చేస్తూ వ‌చ్చారు. తాజాగా ఆ ప‌ద‌విని క‌డ‌ప జిల్లా మైద‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కు ఇవ్వాల‌న్న నిర్ణ‌యంలో బాబు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి పోటీ భారీగా ఉన్నప్ప‌టికీ ఆ ప‌ద‌విని కొంత‌కాలంగా ఎవ‌రికి ఇవ్వ‌ని చంద్ర‌బాబు తాజాగా పుట్టాకు ఇవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఈసారి టీటీడీ బోర్డు ఛైర్మ‌న్ ప‌ద‌విని బీసీల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది.

రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో పుట్టాకు టీటీడీ ప‌గ్గాలు అందే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. స్వ‌త‌హాగా కాంట్రాక్ట‌రుఅయిన పుట్టాకు టీటీడీ ప‌గ్గాలు ఇవ్వ‌టం ద్వారా క‌డ‌ప జిల్లాకు తాను అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న భావ‌న క‌లిగించేందుకే బాబు ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా.. రాయ‌పాటి క‌ల‌ను బాబు పుణ్య‌మా అని పుట్టా కొట్టుకెళ్ల‌నున్నార‌ని చెప్పక త‌ప్ప‌దు. రాయ‌పాటికి మండిపోయే ఈ నిర్ణ‌యంపై ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.