Begin typing your search above and press return to search.

అఫీషియ‌ల్‌: టీటీడీ ఛైర్మ‌న్‌ గా పుట్టా

By:  Tupaki Desk   |   29 Sep 2017 10:28 AM GMT
అఫీషియ‌ల్‌: టీటీడీ ఛైర్మ‌న్‌ గా పుట్టా
X
దేశంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం - తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క మండ‌లి ఛైర్మ‌న్‌ గా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ నియామ‌కంపై అధికారిక ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. గ‌తంలో చ‌ద‌లవాడ కృష్ణ‌మూర్తి చైర్మ‌న్‌ గా ఉన్న పాల‌క‌మండ‌లి గ‌డువు ముగిసి చాలా కాల‌మే అయిన‌ప్ప‌టికీ.. చైర్మ‌న్ ప‌ద‌వికి నెల‌కొన్న పోటీ దృష్యా.. దీనిపై చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యాన్నీ తీసుకోలేక పోయారు. అయితే, తాజాగా.. ఆర్థిక మంత్రి - చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్ అయిన య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాక‌ర్‌ ను నియ‌మిస్తూ.. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

కాగా, పుట్టా గ‌తంలో టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుడిగా రెండేళ్లు సేవ‌లందించారు. చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి చైర్మ‌న్‌ గా ఉన్న స‌మ‌యంలో పుట్టా పాల‌క మండ‌లి స‌భ్యుడిగా ఉన్నారు. కాగా, త‌న నియామ‌కంపై అధికారిక ఉత్త‌ర్వులు వెలువ‌డ‌గానే.. సుధాక‌ర్ స్పందిస్తూ.. ``మా ప్రాధాన్యం అంతా సాధార‌ణ భ‌క్తులు అత్యంత తేలిక‌గా స్వామిని ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేయ‌డ‌మే. అదేవిధంగా హిందూ ధ‌ర్మాన్ని దేశంలోని న‌లుమూల‌ల‌కు తీసుకువెళ్ల‌డం మా క‌ర్త‌వ్యం`` అని చెప్పారు. అదేస‌మ‌యంలో ఆయ‌న రాజ‌కీయాల గురించి కూడా మాట్లాడారు.

టీడీపీ అధిష్టానం ఏం చెబితే అది చేయ‌డం త‌మ క‌ర్త‌వ్యమ‌ని, అధిష్టానికి బ‌ద్ధులై ఉండ‌డ‌మే ల‌క్ష‌ణ‌మ‌ని వెల్ల‌డించారు. ఇక‌, 2019లో పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామ‌న్నారు. కాగా, పుట్టా.. క‌డ‌ప జిల్లా మైదుకూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే. ప్ర‌స్తుతం జిల్లాలో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యం - య‌న‌మ‌ల ఒత్తిడి కార‌ణంగా ఆయ‌న‌కు అత్య‌ధిక డిమాండ్ ఉన్న టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ల‌భించ‌డం విశేషం. ఇప్ప‌టికే ఈ ప‌ద‌వి కోసం. టీడీపీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు - రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీ మోహ‌న్ తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే.