Begin typing your search above and press return to search.

16 వేల టెంకాయల మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   14 Oct 2016 10:31 AM IST
16 వేల టెంకాయల మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే
X
నేతలకు.. నమ్మకాలకు ఉండే అనుబంధం ఎంతన్నది అందరికి తెలిసిందే. తాజాగా అలాంటి నమ్మకానికి సంబంధించిన ఉదంతం విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకుంది. ఎన్నికల్లో తాను గెలిచిన పక్షంలో సింహాద్రి అప్పన్నకు భారీ మొక్కును చెల్లిస్తానని మొక్కుకున్న సదరు రాజకీయ నేత.. తన మొక్కును తీర్చుకోవటంలో భాగంగా ఏకంగా 16 వేల కొబ్బరికాయల్ని కొట్టేయటం పలువురిని ఆకర్షించింది.

అయితే.. ఈ ఎమ్మెల్యే తెలుగు ప్రాంతానికి చెందిన నేత కాకపోవటం గమనార్హం. ఒడిశాలోని గంజాం జిల్లా సొరడ నియోజకవర్గానికి చెందిన బీజేడి ఎమ్మెల్యే పూర్ణ చంద్ర స్వైన్ గత ఎన్నికల వేళ.. సింహాద్రి అప్పన్నను భారీ కోరికే కోరారు. తాను ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలుపొందితే.. అన్ని కొబ్బరికాయలు సమర్పించుకుంటానన్నారు. ఇందుకు తగ్గట్లే 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారపక్షం తరఫున పోటీ చేసిన ఆయన.. 16 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

స్వామి వారికి మొక్కుకున్న మొక్కును తీర్చుకోవటం కోసం తాజాగా సింహాచలానికి వచ్చారు. పార్టీ నేతలు.. కార్యకర్తల పరివారంతో సింహాచలానికి వచ్చిన సదరు ఎమ్మెల్యే.. స్వామి వారిని దర్శనం చేసుకొని.. తన మొక్కు తీర్చుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 16 వేల కొబ్బరికాయల్ని కొట్టే భారీ కార్యక్రమాన్ని తనతో వచ్చిన పరివారంతో ఆయన మొదలు పెట్టి పూర్తి చేశారు. వేలాది టెంకాయల్ని స్వామివారికి తీర్చుకునే కార్యక్రమం భక్తుల్ని విశేషంగా ఆకర్షించింది. 16వేల టెంకాయలంటే మాటలు కాదు కదా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/