Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌తో పొత్తుపై పురందేశ్వ‌రి హాట్ కామెంట్లు..

By:  Tupaki Desk   |   6 April 2022 4:30 PM GMT
జ‌న‌సేన‌తో పొత్తుపై పురందేశ్వ‌రి హాట్ కామెంట్లు..
X
కొన్ని రోజులుగా ఏపీలో బీజేపీ-జ‌న‌సేన పొత్తుపై అనేక చ‌ర్చ‌లు.. విశ్లేష‌ణలు , కామెంట్లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పార్టీ ఆవిర్భావ స‌భ‌లో.. వైసీపీ వ్య‌తిరేక ఓట్లు చీల్చ‌కుండా.. చూస్తాన‌ని చేసిన వ్యాఖ్య‌ల త‌ర్వాత‌.. ఈ విశ్లేష‌ణ‌ల‌కు మ‌రింత ప‌దును పెరిగింది. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను టీడీపీతో క‌లిసి ముందుకు సాగుతాన‌నే ధోర‌ణిని ప‌వ‌న్ వెల్ల‌డించార‌ని.. విశ్లేష‌కులు చెప్పుకొచ్చారు. ఇక‌, బీజేపీ రాష్ట్ర చీఫ్ సొము వీర్రాజు కూడా.. టీడీపీతో క‌లిసి ప‌నిచేసేది లేద‌ని.. అవ‌స‌ర‌మైతే.. ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు త‌మ కార్య‌క‌ర్త‌లు సిద్ధంగా ఉన్నార‌ని.. వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలోఅసలు జ‌న‌సేన‌తో బీజేపీకి పొత్తు ఉంటుందా? ఉండ‌దా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్తితి ఏంటి? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. పైగా.. ఏ పార్టీ కార్య‌క్ర‌మాలు ఆ పార్టీవేఅన్న‌ట్టుగా నాయ‌కులు ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చ‌ర్చ‌పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయ‌కురాలు.. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ కార్య‌క్ర‌మాలు ఎవ‌రికి వారుగా చేసుకుంటున్నా.. రెండు పార్టీల మ‌ధ్య బంధం ఉంద‌న్నారు. ``మిత్ర పక్షంగా పవన్ కళ్యాణ్ మాతో చర్చిస్తే.. మేము కూడా స్పందిస్తాం. ఏపీలో కార్యక్రమాలు వేరైనా . బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుంది`` అని పురందేశ్వ‌రి స్ప‌ష్టం చేశారు.

ఏపీలో కొత్త‌గా ఏర్ప‌డిన ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజ‌య‌వాడ‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంద‌ర్భం బీజేపీ జెండాను విష్కరించిన పురంధరేశ్వరి.. మీడియాతో మాట్లాడారు. త‌న తండ్రి ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ జిల్లాలో బీజేపీ తొలి కార్య‌క్ర‌మంలో త‌నే జెండాను ఎగుర వేయ‌డం కూడా సంతోషం క‌లిగించింద‌ని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాను ఎ ప్పుడో ఏర్పాటు చేసి ఉంటే ఇంకా బాగుండేద‌ని..ప‌రోక్షంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. ఇక‌, విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నాయకులకు బీజేపీని తప్పు పట్టే అర్హత లేదని పేర్కొన్నారు.

ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర పెద్దలకు వివరిస్తాం. రాష్ట్రంలో అధికార దాహంతో చేసే పనులు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. సేవ చేయడం కన్నా.. అధికారమే లక్ష్యంతో పని చేస్తున్నాయి. బీజేపీ అలా చేయ‌డం లేద‌ని పురందేశ్వ‌రి అన్నారు. బీజేపీ ఏనాడూ.. ప్ర‌జ‌ల కోస‌మే నిల‌బ‌డింద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి ఒక్క సీటు రాక‌పోయినా.. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. పోరాడ‌డం లేదా? ఇదీ.. ఇత‌ర పార్టీల‌కు బీజేపీకి ఉన్న తేడా! అని కామెంట్ చేశారు. ``రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పు కావాలని ప్రజలు ఎదురు చుస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఛార్జీల విషయంలో కేంద్రం తన వంతు బాధ్యతగా ధరలు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విషయంలో ఎందుకు తగ్గించడం లేదు.`` అని పురందేశ్వ‌రి ప్ర‌శ్నించారు.

ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగాయన్నారు. అయితే.. గ‌తంలో కేంద్రం రూ.10 చొప్పున ధ‌ర‌లు త‌గ్గించింద‌ని.. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా త‌గ్గించాయ‌ని.. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం రూపాయి కూడా త‌గ్గించ‌లేద‌ని విమ‌ర్శించారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయన్నారు. ``మా ప్రణాళికలు మాకు ఉన్నాయి… వాటికి అనుగుణంగా పని చేస్తాం`` అని అన్నారు. దేశ సేవకి ప్రతి బీజేపీ కార్యకర్త పునరంకితం కావాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారని, డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వాలు ఏర్పాట‌య్యాయ‌ని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లో రెండో సారి అధికారం ఇవ్వడం అంటే బీజేపీ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

మోడీ ప్రధానిగా ఎనిమిదేళ్ళ కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో పేదల అభ్యున్నతికి కృషి చేశారు. ప్రతి కార్యకర్త కూడా పార్టీ గెలుపు కోసం పని చేయాలని అన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ , సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రకాశ్ సూత్రంతో ముందుకెళ్తున్నాం అని పురందేశ్వ‌రి తెలిపారు.