Begin typing your search above and press return to search.

మహిళను జీపుకు కట్టి..పోలీసుల అమానుషం..

By:  Tupaki Desk   |   27 Sep 2018 6:42 AM GMT
మహిళను జీపుకు కట్టి..పోలీసుల అమానుషం..
X
ఉత్తర భారతదేశంలో పోలీసుల అమానుషాలు మితీమిరిపోతున్నాయి.నిన్ననే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ ముస్లిం యువకుడిని ప్రేమించిందని ఓ యువతిని జీపులో ఎక్కించి కొడుతూ అమానుషంగా ప్రవర్తించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడా ఆ సంగతి మరిచిపోకముందే తాజాగా మరో దారుణానికి పోలీసులు ఒడిగట్టారు.

పంజాబ్ పోలీసులు ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారు. మహిళా అనే గౌరవం లేకుండా ఆమెను పోలీస్ జీపుపై కట్టేసి ఊరంతా ఊరేగించారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియోలు - ఫొటోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి..

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లోని చవిందాదేవి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆస్తివివాదంలో నిందితుడు. దీంతో అతడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. ఇంటికి వెళ్లగా నిందితుడు లేడు. అతడి కుమారుడిని పోలీసులు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కుమారుడి భార్య పోలీసులను అడ్డుకొంది. దీంతో ఆగ్రహానికి గురైన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను బలవంతంగా పోలీస్ జీపుపైకి ఎక్కించి కట్టేసి ఊరంతా తిప్పారు. వాహనాన్ని వేగా పోనివ్వడంతో ఆమె కిందపడి తీవ్రగాయాలపాలైంది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. ప్రతిపక్షాలు పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి.ఈ దారుణాన్ని చాలామంది ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.