Begin typing your search above and press return to search.

అమరావతి రైతుల పాదయాత్రకు పులివెందుల రైతుల మద్దతు

By:  Tupaki Desk   |   11 Dec 2021 3:46 AM GMT
అమరావతి రైతుల పాదయాత్రకు పులివెందుల రైతుల మద్దతు
X
న్యాయస్థానం టు దేవస్థానం వరకు అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర మంగళవారం రాయలసీమలోకి చేరుకుంది. అమరావతి రైతుల పాదయాత్రకు సీమ ప్రజానికం పెద్దగా స్పందించదని అంతా అనుకున్నారు. ప్రత్యేక రాయలసీమ కోసం పనిచేస్తున్న కొన్ని సంఘాలు.. పాదయాత్రను అడ్డుకుంటామని కూడా హెచ్చరించాయి. అమరావతి రైతులు ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఎలాంటి నిరసన, ప్రతిఘటన లేకుండానే రాయలసీమలో పాదయాత్ర సాగింది. రెండో రోజు పాదయాత్రను కూడా దిగ్విజయంగా ముగించారు. ఇదిలా వుంటే మూడు రాజధానులను చేసి తీరుతామని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తాత్కాలికంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. తిరిగి పకడ్బందీగా అసెంబ్లీలో బిల్లు పెడతామని జగన్ స్పష్టం చేశారు.

అమరావతి రైతులకు జగన్‌ సొంత నియోజకవర్గంలోనే మద్దతు లభిస్తోంది. చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రకు పులివెందుల రైతులు సంఘీభావం తెలిపారు. అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానులను పులివెందుల రైతులు తప్పుబడుతున్నారు. మూడు రాజధానులను ఎందుకు వ్యతిరేకిస్తారని ప్రశ్నించే వారు ఓ లాజిక్ కూడా చెబుతున్నారు. రాజధానిలో పనిపడితే అమరావతికి ఒకే రోజులో ముగించుకుని రావొచ్చని, అదే విశాఖ రాజధాని అయితే 900 కిలోమీటర్లు ప్రయాణించాలని చెబుతున్నారు. సామాన్య జనానికి ఎంతో సమయం, డబ్బు వృథా అవుతుందని అంటున్నారు. నడిబొడ్డున వున్న అమరావతే అందరికీ అనుకూలమని చెబుతున్నారు. అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జగన్‌ సొంత నియోజకవర్గం నుంచీ రైతుల పాదయాత్రకు మద్దతు పలికేందుకు వచ్చామని, అమరావతి రైతులకు అన్ని విధాలా అండగా ఉంటూ పోరాడతామని పులివెందులు రైతులు స్పష్టం చేస్తున్నారు.

పులివెందుల నియోజకవర్గంలో వున్న ఫ్యాక్షన్‌ సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో జగన్‌ తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఫ్యాక్షనిజాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారని.. అయితే జగన్‌ రాకతో ఆ సంస్కృతి తగ్గకపోగా మరింత పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఫ్యాక్షన్‌ సంస్కృతిని నియోజకవర్గం దాటించి ఇపుడు రాష్ట్రమంతటా వ్యాపించేలా చేస్తున్నారని.. పులివెందుల నియోజకవర్గంలో ఎప్పటి నుంచో జగన్‌ కుటుంబ దౌర్జన్యాలను, రౌడీయిజాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి అప్రజాస్వామిక తీరును రాష్ట్రమంతటా ప్రజలకు తెలియజేస్తామని చెబుతున్నారు. పులివెందుల సంస్కృతిని అమలు చేయడం ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు సాధించిందని చెబుతున్నారు. పులివెందుల్లో వైఎస్‌ జగన్‌ కుటుంబం ఎప్పటి నుంచో ఫ్యాక్షనిజం, రౌడీయిజం, రిగ్గింగ్‌ వంటి విధానాలతోనే విజయం సాధిస్తూ వస్తోందని ఆరోపించారు. ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులపై తాము ఏళ్ల తరబడి పోరాడుతునే ఉన్నామని అంటున్నారు. పులివెందులలో వైసీపీ ఆగడాలకు తాము భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు.

అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి రాయలసీమలో టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన మద్దతు ఇస్తూ పాదయాత్రలో భాగమవుతున్నారు. అయితే ఇదే ప్రాంతానికి చెందిన ప్రజా సంఘాలు అమరావతి రైతుల ఉద్యయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మూడు రాజధానుల్లో భాగంగా హైకోర్టును సాధించుకున్న సీమ ప్రజలకు అమరావతి రైతుల యాత్ర శరాఘాతంగా మారింది. కర్నూలును న్యాయ రాజధాని చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఆంధ్రప్రాంతం నుంచి పెద్ద ఎత్తును నిరసనలు తెలిపారని, ఇప్పుడు అమరావతి రైతులకు సీమ పార్టీలు ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నిస్తున్నారు.