Begin typing your search above and press return to search.

జ‌న్మ‌భూమి అదుర్స్ ఏం కాదులే బాబు

By:  Tupaki Desk   |   5 Jan 2018 7:25 AM GMT
జ‌న్మ‌భూమి అదుర్స్ ఏం కాదులే బాబు
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జన్మభూమి గురించి...తెలుగుదేశం వ‌ర్గాలు చెప్తున్న మాట‌ల‌కు, చేస్తున్న ప్ర‌క‌ట‌ల‌న‌కు...క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌కు తేడా ఉందా? త‌మ స‌మ‌స్య‌ల విష‌యంలో నిల‌దీత‌లు..నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప‌లు జిల్లాల్లో జ‌న్మ‌భూమి గ్రామసభల్లో నిరసనలు - నిలదీతల పర్వం రోజూ కొనసాగుతోంద‌ని అంటున్నారు. ఏకంగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌తామ‌నే బెదిరింపు కూడా జ‌న్మ‌భూమి వేదిక‌గా చోటుచేసుకుంటుడ‌టం గ‌మ‌నార్హం.

విజయవాడ సింగ్‌ నగర్‌ లోని బసవపున్నయ్య స్టేడియంలో జన్మభూమి సభలో ఇళ్ల స్థలాల సమస్యపై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు - నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌ లను ప‌లువురు నాయకులు నిలదీశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. గుంటూరు జిల్లా పెదకాకాని అంబేద్కర్‌ కాలనీకి చెందిన రోశయ్య అనే యువకుడు జన్మభూమి కమిటీని రద్దు చేయాలని - సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తహశీల్దార్‌ కార్యాలయంలోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. తమ కాలనీపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. `మా సమస్య పరిష్కారం కాకపోతే నా చావుకు ప్రభుత్వం కారణమవుతుంది` అంటూ తనతోపాటు తీసుకొచ్చిన పెట్రోల్‌ - కిరోసిన్‌ సీసాలను చూపాడు. వేరే మార్గం నుంచి తహశీల్దార్‌ లోకి పోలీసులు వెళ్లి రోశయ్యను అరెస్టు చేసి స్టేషన్‌ కు తరలించి కేసు నమోదు చేశారు.

చింతలపూడి ఎత్తిపోతల కాలువలో భూములు కోల్పోయిన వారికి ఎకరాకు రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎర్రగుంటపల్లిలో సభను రైతులు అడ్డుకున్నారు. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సౌకర్యం కల్పించకపోవడంపై ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం మాదాలవారి పాలెం గ్రామస్తులు అధికారులను నిలదీశారు. పరిహారం చెల్లించకపోవడంపై విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం కొండెంపూడి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం భూ నిర్వాసితులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి బిల్లులు చెల్లించే వరకూ జన్మభూమి సభను జరగనీయబోమంటూ తూర్పుగోదావరి జిల్లా విఆర్‌.పురం మండలం రాజుపేట - పెద్దమట్టపల్లిల్లో అడ్డుకున్నారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కేసలిలో పెద్దగెడ్డ రిజర్వాయర్‌ నిర్వాసితులకు పట్టాలిచ్చినా భూములు అప్పగించకపోవడం - కొంతమందికి ఆర్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు చేయకపోవడంపై సిపిఎం నాయకుడు కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యాన నిర్వాసితులు నిలదీశారు.

బోయ - వాల్మీకులను ఎస్‌ టిల్లో చేర్చి గిరిజనులకు అన్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తుంటే గిరిజన ఎమ్మెల్యే అయి ఉండి ఎందుకు నోరు మెదపడం లేదని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుపై జీలుగుమిల్లి మండలం దర్భగూడెం సభలో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయ - వాల్మీకులను ఎస్‌ టిల్లో చేర్చే ప్రయత్నాలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని దారపాడు - కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్లను కూల్చేయడంపై ప్రజలు జన్మభూమిని అడ్డుకున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తున్నారంటూ చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి పంచాయతీలో జన్మభూమి కార్యక్రమాన్ని సర్పంచ్‌ - ఎంపిటిసి - వార్డు సభ్యులు బహిష్కరించారు.