Begin typing your search above and press return to search.

ఏడాదైంది..న‌యీం కేసు ఏం చేశారు?

By:  Tupaki Desk   |   8 Aug 2017 5:56 AM GMT
ఏడాదైంది..న‌యీం కేసు ఏం చేశారు?
X
రాష్ట్రంలోనే గాక జాతీయ స్థాయిలో సంచలనం రేపిన గ్యాంగ్‌ స్టర్ నయీమొద్దీన్ అలియాస్ నయీం ఎన్‌ కౌంటర్‌ లో హతమై ఏడాది గడుస్తోంది. 2016 ఆగస్టు 8న షాద్‌ నగర్‌ లోని మిలీనియం కాలనీలో గ్యాంగ్‌ స్టర్‌ నయీమ్‌ ఎన్‌ కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. నయీం డెన్‌ లలో నుంచి కోట్లాది రూపాయలు, నగలు, భూముల దస్తావేజులు - ఆయుధాలు - కార్లను సిట్‌ స్వాధీనం చేసుకుంది. ఒకపక్క సిట్‌ - మరోపక్క మహబూబ్‌ నగర్‌ - రంగారెడ్డి - సైబరాబాద్‌ - రాచకొండ - నల్లగొండ - వరంగల్‌ - కరీంనగర్‌ - ఖమ్మం పోలీసులు నయీంకు సంబంధించి 340కి పైగా కేసులను నమోదు చేసి దర్యాప్తు జరిపారు. నయీమ్‌ భార్య - కుటుంబసభ్యులతోపాటు మొత్తం 270 మందికి పైగా అతని గ్యాంగ్‌ సభ్యులను అరెస్టు చేశారు. రాష్ట్రంలోనే గాక ఏపీ - గోవా - ఛత్తీస్‌ గఢ్‌ తదితర రాష్ట్రాలకు గ్యాంగ్‌ స్టర్‌ కేసు దర్యాప్తు విస్తరిస్తుందని భావించారు.

అయితే న‌యీం కేసు ముందుకు సాగడం లేద‌ని బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. నయీంను ఎన్‌ కౌంటర్‌ చేసి, అతని నేర సామ్రాజ్యానికి అడ్డుకట్ట వేసిన పోలీస్‌ శాఖే గ్యాంగ్‌ స్టర్‌ మూలాలన్నిటినీ పెకలించి వేస్తుందని బాధితులు ఆశించారు. కానీ, ఇప్పటి వరకూ నయీంతో కలిసి ఘోరమైన నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలున్న కుడిభుజం శేషన్నతో పాటు అతని 30 మంది సభ్యుల ముఠా ఇంకా సిట్‌ కు చిక్కక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము గాలిస్తున్నామని త్వరలో పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఏడాది కావస్తున్నా ఫలితం లేక పోవడంతో బాధితులకు ఆందోళన కలిగిస్తోంది. బెదిరించి ,కిడ్నాప్‌ లకు పాల్పడి తమ నుంచి నయీం కబ్జా చేసిన వందల ఎకరాల భూమిని తిరిగి ఇప్పించే విషయమై ప్రభుత్వం నుంచి తగిన చర్యలు లేవని వందలాదిమంది బాధితులు వాపోతున్నారు. అదే సమయంలో శేషన్నవంటి కరడుగట్టిన గ్యాంగ్‌ స్టర్‌ పట్టుబడక పోవడంతో తాము ఫిర్యాదు చేస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుందని మరి కొందరు బాధితులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అదే సమయంలో దాదాపు 20 ఏళ్ల‌కు పైగా నయీంకు చేయూతనిచ్చి అతని నేరాలు పెరగడానికి కారణమవటమే గాక, తామూ కోట్లాది రూపాయల అక్రమాస్తులను కూడబెట్టుకున్న కొందరు పోలీసు అధికారుల విషయంలో తగిన దర్యాప్తు సాగడం లేదని బాధితుల నుంచి విమర్శలున్నాయి. అలాగే నయీంతో అంటకాగి ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న కొందరు నాయకుల విషయంలోనూ నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగడం లేదని ఆరోపణలొస్తున్నాయి.

కాగా, నయీం కేసులో నిందితులుగా ఉన్న పలువురిపై చార్జ్‌షీట్‌లు దాఖలు చేశామని, నరుూంతో అంటకాగిన ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నామని సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. నయీంపై పలు కేసులు నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ నయీంతోపాటు అతని అనుయాయులపైనా కేసులు నమోదైన కేసుల విచారణ తుది దశకు చేరుకుందని వివ‌రించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 890 మందిని విచారించి 227 మందిని అదుపులోకి తీసుకున్నామని... 128 మందిని అరెస్టు చేసి, 9 చార్జ్‌ షీట్లు దాఖలు చేశామని, మరో 22 కేసుల విచారణ తుది దశకు చేరిందని సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ వ్యవహారంలో 14 మందిపై పీడీ యాక్టు పెట్టామని, నరుూంతో సంబంధాలున్న ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశామని, ఈ కేసుల విచారణ త్వరలోనే పూర్తవుతుందని నాగిరెడ్డి వివరించారు.