Begin typing your search above and press return to search.

కరోనా కష్ట కాలంలో కూడా ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు !

By:  Tupaki Desk   |   20 April 2021 5:32 AM GMT
కరోనా కష్ట కాలంలో కూడా ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు !
X
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విధ్వంసం సృష్టిస్తుంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనితో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసేస్తున్నారు. అయితే ,కరోనా కోరలు చాచుకొని చూస్తున్న ఈ సమయంలో కార్పొరేట్‌ కాలేజీలు, పాఠశాలలు కరోనా కష్ట కాలంలోనూ ఫీజులను ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తామని బెదిరింపులకు దిగుతున్నాయట. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, పదో తరగతి మార్కుల నిర్ణయాధికారం విద్యాసంస్థల చేతుల్లో ఉండటంతో.. వాటి సిబ్బంది చెప్పినట్టు విద్యార్థుల తల్లిదండ్రులు వినాల్సి వస్తోంది. పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ద్వారా విద్యార్థుల ఫలితాలను నిర్ణయిస్తామని తెలిపింది. విద్యార్థుల విద్యాసామర్థ్యాన్ని గుర్తించే నిర్ణయాధికారం మాత్రం సంబంధిత విద్యా సంస్థలదే కానుంది.

అలాగే ,ఇప్పటికే జరిగిన పదో తరగతి ఎఫ్‌ఏ-1 పరీక్షల మార్కులను ప్రైవేటు పాఠశాలలు విద్యాశాఖకు ఇంకా సమర్పించలేదు. దీనికి ఇంకా సమయం ఉంది. దీనితో ఈ మార్కులు కూడా ఫలితాల్లో కీలకంగా మారనున్నాయి. అలాగే ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలోనూ ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో ఇదే అదనుగా భావిస్తూ.. ఇప్పుడు కచ్చితంగా పూర్తి ఫీజులను చెల్లించాల్సిందే అన్న ధోరణిలో కాలేజీలు, పాఠశాలల సిబ్బంది మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఈవోలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా చర్యలు కొరవడుతున్నాయి.

అయితే , ప్రభుత్వ నియమాలని ఒకసారి చూస్తే ... విద్యాసంస్థలు ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, అలాగే ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని గత ఏడాది స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. ట్యూషన్‌ ఫీజు అంటే.. కేవలం పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతభత్యాలకు చేస్తున్న ఖర్చు వరకు మాత్రమే. ఏడాదికి రూ.లక్ష ఫీజు ఉంటే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యూషన్‌ ఫీజు రూ.25 వేలకంటే మించదు. కానీ, ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. వనపర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినికి ఏడాది ఫీజు రూ.20 వేలు కాగా ,ఇప్పటికే తల్లిదండ్రులు రూ.8 వేలు చెల్లించారు. మిగతా రూ.12 వేలను చెల్లించకుంటే మార్కులు తగ్గిస్తామని, మెమోలు ఇవ్వబోమని యాజమాన్యం బెదిరిస్తోంది. మేస్త్రి పనిచేసే ఆ అమ్మాయి తండ్రి ఎంత చెప్పుకున్నా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.