Begin typing your search above and press return to search.

సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్

By:  Tupaki Desk   |   17 March 2021 9:41 AM GMT
సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్
X
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు కూడా కరోనా సోకుతుంటే... కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వాలు టెన్షన్ పడుతున్నాయి. పరిస్థితి చేజారిపోయిందన్న విషయం అర్థమౌతుంది. ఇండియాలో సెకండ్ వేవ్ మొదలై రెండు వారాలు అయిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదం అని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది.

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ - ఛత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రి భగేల్‌ గైర్హాజరైనట్లు తెలుస్తోంది. సీఎం మమతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మమత కాలికి గాయమైన తర్వాత , ఆమె కుర్చీలో నుండే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ముఖ్యమంత్రుల సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. మమతకు బదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటెండైనట్లు తెలుస్తోంది.

దేశంలో కరోనా కట్టడికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే కీలక విషయాన్ని చర్చించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేశారు ప్రధాని మోదీ. వైరస్‌ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయో అడిగి తెలుసుకోనున్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలు మళ్లీ లాక్‌ డౌన్ లు - కంటైన్‌ మెంట్ జోన్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.ప్రస్తుతం దేశంలోని 20 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర - పంజాబ్ - కర్ణాటక సహా 6 రాష్ట్రాల్లో జోరు ఎక్కువగా ఉంది.

దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. మొన్న‌ క‌రోనా కేసుల సంఖ్య 24,492గా న‌మోదు కాగా, గ‌త‌ 24 గంట‌ల్లో 28,903 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య - ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 17,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 188 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,044 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,45,284 మంది కోలుకున్నారు.