Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ కు బిర్యానీ-బాహుబ‌లిని క‌లిపిన రాష్ట్రప‌తి

By:  Tupaki Desk   |   19 Dec 2017 2:42 PM GMT
హైద‌రాబాద్‌ కు బిర్యానీ-బాహుబ‌లిని క‌లిపిన రాష్ట్రప‌తి
X
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్ర‌సంగించిన రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ ఈ సంద‌ర్భంగా తెలుగువారిపై ప్ర‌శంస‌లు గుప్పించారు.తెలుగులో సోదర.. సోదరీమణుల్లారా.. అని తన ఉపన్యాసాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చానని చెప్పారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కోవింద్ పేర్కొన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ అన్నారు.

ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పదని..ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు హాజరైనందుకు సంతోషంగా ఉందని రాష్ట్రప‌తి అన్నారు. తెలుగు భాష అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దేశ - విదేశాల నుంచి ఈ సభలకు హాజరైన వారందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా తెలుగు భాష మాట్లాడుతారని రాష్ట్రపతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి గురజాడ అప్పారావు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. తన కంటే ముందు ముగ్గురు తెలుగు వారు రాష్ర్టపతులయ్యారు. తెలుగు తెలిసిన రాష్ట్రపతుల్లో సర్వేపల్లి - వివి గిరి - సంజీవరెడ్డి ఉన్నారని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి - మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా తెలుగువారే అని రాష్ట్రపతి పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో తెలుగు వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం చేశారని తెలిపారు. హైదరాబాద్ అంటే బిర్యానీ - బ్యాడ్మింటన్ - బాహుబలి అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ సంస్కృతి - సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముగింపు వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. తెలంగాణ విశిష్టతను తెలిపే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ముగింపు వేడుకలను వీక్షించేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి భాషాభిమానులు భారీ స్థాయిలో తరలివచ్చారు.