Begin typing your search above and press return to search.

నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్

By:  Tupaki Desk   |   4 March 2020 11:37 AM GMT
నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్
X
భారత న్యాయ వ్యవస్థలోని లోపాలను నిర్భయ దోషులు ఉపయోగించుకున్నంతగా మరెవరూ ఉపయోగించుకోలేదంటే అతిశయోక్తి కాదు.జనవరి 22, ఫిబ్రవరి 1 - మార్చి3...ఇలా కొన `సాగు`తోన్న నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీలను చూసి దేశ ప్రజలు విసిగెత్తారు. మార్చి 3న వారికి దాదాపు ఉరి ఖాయమనుకుంటున్న తరుణంలో....ఉరి శిక్ష వాయిదా పడింది. సోమవారం నాడు తన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీం కొట్టివేసిన కొద్ది గంటలకే పవన్...క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. దీంతో, మరోసారి డెత్‌ వారెంట్లు ఇచ్చే వరకు ఉరి నిలుపుదల చేయాలని పటియాల హౌస్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తాజాగా బుధవారం నాడు పవన్‌ గుప్తా రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ ను రామ్‌ నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. దీంతో, ఆ నలుగురు దోషులకు ఉన్న మార్గాలన్నీ మూసుకపోయినట్లేనని, ఇక ఉరి ఖాయమని తెలుస్తోంది.

తాజాగా రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడంతో నలుగురు దోషులకు ఉరి తప్పదని లాయర్లు చెబుతున్నారు. ఇక వారికి ఎటువంటి న్యాయపరమైన అవకాశాలు లేవని, మరో నాలుగైదు రోజుల్లో ఉరి శిక్ష అమలుకు డెత్ వారెంట్ జారీ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ ఇప్పటికే పవన్ తరఫు న్యాయవాదిపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో, ఉరి శిక్ష ఆపేందుకు ఇకపై లాయర్లు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవచ్చని తెలుస్తోంది. ఇన్ని వాయిదాల తర్వాత కూడా మరోసారి డెత్ వారెంట్ ఇచ్చి... ఉరి మరోసారి వాయిదా పడితే...దేశంలో న్యాయవ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం పోతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేందుకు ఇన్నేళ్లు పట్టినందుకు నిర్భయ ఆత్మ ఎంత క్షోభిస్తుందో....ఈ ఉరి మరోసారి వాయిదా పడితే అంతకు మించి క్షోభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.