Begin typing your search above and press return to search.

'రాష్ట్ర‌ప‌తి' సెంట్రిక్‌గా గుజ‌రాత్ రాజ‌కీయం.. 27 సీట్ల కోసం!

By:  Tupaki Desk   |   20 Nov 2022 12:30 AM GMT
రాష్ట్ర‌ప‌తి సెంట్రిక్‌గా గుజ‌రాత్ రాజ‌కీయం.. 27 సీట్ల కోసం!
X
రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము .. ఇప్పుడు రాజ‌కీయంగా బీజేపీకి ఎంతో ఉప‌యోగ‌పడుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ఆమెను రాష్ట్ర‌ప‌తిగా ఎంపిక చేసిన‌ప్పుడు.. ఇది రాజ‌కీయ ప్రయోజ‌నం కాద‌ని.. బీజేపీ నేత‌లు ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడు మాత్రం గుజ‌రాత్‌లోని 27 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునేందు కు బీజేపీ నాయ‌కులు.. ''మేం ఆదివాసీల‌కు రాజ్యాంగ బద్ధ‌మైన ప‌ద‌వులు ఇచ్చాం'' అని ప్ర‌క‌టించుకుం టున్నారు. ప్ర‌చారం చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి సెంట్రిక్‌గా రాజ‌కీయం జోరుగా సాగుతోంది.

గుజరాత్లో గత రెండున్నర దశాబ్దాలకుపైగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఇక్క‌డ 27 నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క‌మైన ఆదివాసీల ఓట్లను సంపాదించడంలో వెనకబడే ఉంది. అయితే ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఆదివాసీల ఓట్లు సంపాదించటానికి బీజేపీ.. రాష్ట్ర‌ప‌తి కార్డును తెర‌మీదికి తెచ్చి ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ ఓట్లు, సీట్లు గెల్చుకోవటంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. గుజరాత్‌లో అన్ని పార్టీలనూ ఆకర్షిస్తున్న వర్గం ఆదివాసీలు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఆదివాసీల ఓట్లు సంపాదించటానికి కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు కూడా చెమటోడుస్తున్నాయి. కారణం గ్రామీణ ప్రాంతాల్లోని అనేక నియోజకవర్గాల్లో రాష్ట్ర జనాభాలో 15 శాతం ఉన్న ఆదివాసీల ఓట్లే కీలకం!

గుజరాత్‌లో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌ పార్టీ వైపే ఇప్పటిదాకా మొగ్గు చూపుతూ వస్తున్నారు. అధికారాన్ని అందుకోలేకపోతున్నా.. ఆదివాసీల ఓట్లు, సీట్లను మాత్రం కాంగ్రెసే ఎక్కువగా సాధిస్తోంది. 2017 ఎన్నికల్లో 27 రిజర్వ్‌డ్‌ సీట్లకుగాను కాంగ్రెస్‌ 15 గెల్చుకోగా..బీజేపీ ఎనిమిదింటిలో మాత్రమే నెగ్గింది.

రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచీ ఆదివాసీ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగుతూనే ఉంది. 'గతంలో మా ప్రభుత్వాలు ఇచ్చిన అటవీ ఉత్పత్తులపై హక్కు, ఇతర అభివృద్ధి పనులకు విశ్వాసంతో ఆదివాసీలు మాతోనే ఉంటున్నారు. ఇక ముందు కూడా ఉంటారు' అని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తంజేస్తున్నారు. అసెంబ్లీలో విపక్ష నేత పదవిని కూడా.. జేత్‌పుర్‌ ఎమ్మెల్యే ఆదివాసీ నేత సుఖ్‌రామ్‌ రాత్వాకు కాంగ్రెస్‌ అప్పగించింది.

అయితే, ఈసారి ఎలాగైనా ఆదివాసీలపై కాంగ్రెస్‌ పట్టును దెబ్బతీయాలని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర‌ప‌తి కార్డును బ‌య‌ట‌కు తీసింది. ప్రధాని మోడీ పదేపదే ఈ ప్రాంతాల్లో పర్యటించారు. బీజేపీ ఇటీవలే ఈ ప్రాంతాల్లో గుజరాత్‌ గౌరవ్‌ యాత్ర చేపట్టింది. "ఈసారి మేం 27 సీట్లకుగాను 20 గెల్చుకోబోతున్నాం. ఆదివాసీల్లో కూడా మోడీపట్ల ఆదరణ పెరిగింది. ఎందుకంటే.. ఆ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తిని చేశాం." అని గుజరాత్‌ ఆదివాసీ అభివృద్ధి శాఖ మంత్రి వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.