Begin typing your search above and press return to search.

తూప్రాన్‌ లో మాన‌వ మృగాల ఆరాచ‌కం

By:  Tupaki Desk   |   4 Dec 2017 4:28 AM GMT
తూప్రాన్‌ లో మాన‌వ మృగాల ఆరాచ‌కం
X
అరె.. ఇలాంటి మ‌నుషుల మ‌ధ్యా మ‌నం ఉన్న‌దంటూ సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిన ఉదంత‌మిది. నిండు గ‌ర్భ‌వ‌తి అన్న‌ది కూడా చూడ‌కుండా మాన‌వ‌మృగాళ్ల ఆరాచ‌కం వింటే.. ఏమైపోతున్నాం.. ఎక్క‌డికిపోతున్నామ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఊరెళ్లేందుకు డీసీఎం ఎక్కిన ఏడు నెల‌ల గ‌ర్భ‌వ‌తిపై లైంగిక దాడుల‌కు య‌త్నించ‌గా.. ఆత్మాభిమానంతో వారి నుంచి త‌ప్పించుకునేందుకు డీసీఎం దూకి ప్రాణాలు పోగొట్టుకున్న మ‌హిళ ఉదంత‌మిది.

మెద‌క్ జిల్లా తూప్రాన్ మండ‌లం రావెళ్లి శివారులో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తూఫ్రాన్ మండ‌లం రావెళ్లి పంచాయితీ ప‌రిధి పోత‌రాజ్ ప‌ల్లికి చెందిన ఉడే రేగండ‌.. క‌ళావ‌తిలు దంప‌తులు. పాత దుస్తుల్ని అమ్మి జీవిస్తుంటారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.. ఒక కుమారుడు.

శ‌నివారం రాత్రి పాత దుస్తుల్ని అమ్మిన 35 ఏళ్ల క‌ళావ‌తి రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యంలో పెద్ద కుమార్తె.. ఏడేళ్ల శిరీష‌ను వెంట పెట్టుకొని హైద‌రాబాద్ నుంచి నిజామాబాద్ వెళుతున్న డీసీఎంలో బ‌య‌లుదేరారు. రాత్రి ప‌ది గంట‌ల వేళ డీసీఎం ఎక్కిన క‌ళావ‌తిపై డీసీఎం డ్రైవ‌ర్ క‌న్నేశాడు. డ్రైవ‌ర్ తో పాటు ఉండే మ‌రో వ్య‌క్తి కూడా క‌ళావ‌తి ప‌ట్ల క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తూ అత్యాచారయ‌త్నం చేశారు.

త‌మ‌ను దింపాల్సిన చోట దింప‌కుండా వెళ్లిపోతున్న వాహ‌నం ఆప‌కుండా వెళ్లిపోతుండ‌టంతో భ‌యాందోళ‌న‌ల‌కు గురైన క‌ళావాతి వాహ‌నం నుంచి కింద‌కు దూకేశారు. దీంతో అర‌కిలోమీట‌రు వెళ్లిన దుండ‌గులు.. క‌ళావ‌తి కుమార్తెను బ‌ట్ట‌ల మూట‌ను వ‌దిలేసి వెళ్లిపోయారు.

త‌ల్లి కోసం వెతికిన ఆమె కుమార్తెకు నిర్జీవంగా ప‌డి ఉన్న క‌ళావ‌తి క‌నిపించింది. ఎంత క‌దిపినా క‌ద‌ల‌కుండా ప‌డి ఉన్న త‌ల్లిని చూసి ఏడ‌స్తుండ‌గా.. స్థానికులు అక్క‌డ‌కు చేరుకున్నారు. వాహ‌నం నుంచి దూకేయ‌టంతో బ‌ల‌మైన గాయ‌మై ఆమె మ‌ర‌ణించారు. ఈ ఉదంతం గురించి విన్న వారంతా తీవ్ర ఆవేద‌నకు గురి అవుతున్నారు. గ‌ర్భ‌వ‌తి అని కూడా చూడ‌కుండా.. మృగాల కంటే దారుణంగా వ్య‌వ‌హ‌రించిన వైనం అంద‌రి కంటా క‌న్నీరు పెట్టిస్తోంది.