Begin typing your search above and press return to search.

ప్రసవం కోసం 20 కిలోమీటర్లు నడిచిన గర్భిణి..!

By:  Tupaki Desk   |   27 Aug 2019 5:25 AM GMT
ప్రసవం కోసం 20 కిలోమీటర్లు నడిచిన గర్భిణి..!
X
మన్యంలోని గిరిజన గ్రామాల్లో మృత్యు ఘోష కొనసాగుతూనే ఉంది. మౌలిక వసతులు లేక - సకాలంలో వైద్య సేవలు అందక మన్యంలో మరో గర్భిణి మృత్యువాత పడింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం జమదంగిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం కొండ ప్రాంతాల్లో 20 కిలోమీటర్లు నడిచి వెళ్లిన లక్ష్మి అనే 28 ఏళ్ల నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

చికిత్స కోసం జమదంగి నుంచి జి.మాడుగుల మండలం బొయితిలో ఉన్న ఆర్ ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లిన ఈ మహిళ చికిత్స అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమైంది. మార్గమధ్యలో నొప్పులు రావడంతో బంధువులు డోలీలో ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది బాధిత కుటుంబ వివరాలను అడిగి తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ ఘటనపై వైద్యాధికారులు స్పందించక పోవడం గమనార్హం.

చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ లో ఏడు ఐటీడీఏ గిరిజన ప్రాంతాలలో 2018 మార్చి నెల నుండి 122 బైక్‌ అంబులెన్స్‌ లు ఏర్పాటు చేసింది. సీతంపేటలో 15 - పార్వతీపురంలో 24 - పాడేరులో 42 - రంపచోడవరంలో21 - చింటూరులో 6 - కె.ఆర్‌ పురంలో 8 - శ్రీశైలంలో 6 బైక్‌ అంబులెన్స్‌ లు ప్రారంభించింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంతో కంపేర్ చేస్తే వీటి సంఖ్య తక్కువే అయినా చాలావరకు సేవలందించేవి. అయితే.. ఇవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి... బైకు అంబులెన్సు సిబ్బందికి జీతాలందుతున్నాయా లేదా.. ఎందుకు వీటి సేవలు తగ్గిపోయాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.