Begin typing your search above and press return to search.

ఎంజీఆర్ నాటి అనుభవాలతో ముందు జాగ్రత్త

By:  Tupaki Desk   |   5 Dec 2016 8:15 PM GMT
ఎంజీఆర్ నాటి అనుభవాలతో ముందు జాగ్రత్త
X
ఎంజీఆర్... తమిళనాడుకు ఒకప్పటి ముఖ్యమంత్రి. తిరుగులేని నేత - సూపర్ హీరో. జయలలితకు రాజకీయ గురువు. ఆయనకు వారసురాలిగానే జయ తమిళనాడు రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదిగారు. అలాంటి ఎంజీఆర్ మరణించినప్పుడు తమిళనాడు అల్లకల్లోలమైంది. అనారోగ్యంతోనే ఆయన చనిపోయినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ఆవేదనలో, ఆవేశంలో అల్లర్లు సృష్టించారు. తమిళనాడును రావణ కాష్ఠం చేశారు. జయలలితపైనా ప్రజల్లో ఇప్పుడు అదే అభిమానం. పురుచ్చి తలైవి అని పిలుచుకునే అమ్మ ఇక లేదని తెలిస్తే తమిళ ప్రజలు తట్టుకోలేరు. ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. అందుకేనేమో.. జయ ఆరోగ్య పరిస్థితిపై, ఆమె మరణంపై అత్యంత రహస్యంగా ఉంచుతూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక దుర్వార్తను వెల్లడించారు.

1987లో ఎంజీఆర్ చనిపోయినప్పుడు తమిళనాడులో కల్లోల పరిస్థితులు చెలరేగాయి. లూటీలు జరిగాయి. దుకాణాలు, బస్సులు, ఆసుపత్రులు, సినిమాహాళ్లను జనం తగలబెట్టారు. లూటీలు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. చివరకు పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చి కర్ఫ్యూ ఏర్పాటు చేసి పరిస్థితులను అదుపులోకి తేవాల్సి వచ్చింది. ఎంజీఆర్ అంత్యక్రియల సమయంలో జరిగిన అల్లర్లలోనే 29 మంది చనిపోయారు. 50 మంది పోలీసులు దారుణంగా గాయపడ్డారు. ఆయన అంత్యక్రియల్లో 12 లక్షల మంది పాల్గొన్నారు. ఎంజీ ఆర్ మరణాన్ని తట్టుకోలేక 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

జయ మరణం తరువాత అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. తమిళనాడు మొత్తం పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు. 17 బెటాలియన్లను రంగంలోకి దించారు. మండల స్థాయి నుంచి అన్ని చోట్లా పోలీసు దిగ్బంధనమే. చివరకు ప్రజలను మెల్లగా పరిస్థితులకు మౌల్డ్ చేసి అమ్మ లేదన్న నిజం చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/