Begin typing your search above and press return to search.

అధికారికం: అమ్మ ఆరోగ్యంపై అపోలో చైర్మన్

By:  Tupaki Desk   |   4 Nov 2016 4:56 PM IST
అధికారికం: అమ్మ ఆరోగ్యంపై అపోలో చైర్మన్
X
సుమారు నెల్లన్నర రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అమ్మ ఆరోగ్యపై రకరకాల కథనాలు రావడం, వాటిని అన్నడీఎంకే నేతలు పలువురు ఖండించడం తెలిసిందే. అభిమానుల్లో ఆ సందేహాలు నివృత్తి చేసేందుకు అపోలో నుంచి హెల్త్ బులెటిన్ లు విడుదలవ్వడం జరుగుతూ ఉండేది. అయితే జయలలిత ప్రస్తుత ఆరోగ్యంపైనా, హెల్త్ కండిషన్ పైనా అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి స్పందించారు.. మరో మూడు లేదా నాలుగు వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

శుక్రవారం ఈ విషయాలపై మాట్లాడిన ప్రతాప్ సి.రెడ్డి... జయలలిత ఆరోగ్యం మెగురుపడుతోందని, క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ) నుంచి రెండు - మూడురోజుల్లో రూమ్ లోకి మార్చనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ... జయలలిత వేగంగానే కోలుకుంటున్నారని, తన చుట్టు ఏం జరుగుతుందనే విషయాలను ఆమె గుర్తిస్తున్నారని, ఆమెకు ఏం కావాలో ఆమే స్వయంగా అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో మరోసారి అధికారికంగా అమ్మ ఆరోగ్యంపై తాజా సమాచారం తెలిసినట్లయ్యింది.

ఇదే సమయంలో అమ్మ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని, ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి దాదాపు బయట పడటంతో ఆమెను సాదారణ గదిలోకి మారుస్తున్నారని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు - అధికార ప్రతినిధి సి.పొన్నియన్ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, జయలలిత సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/