Begin typing your search above and press return to search.

పీకే టీం రంగంలోకి దిగినట్లేనా ?

By:  Tupaki Desk   |   29 Sep 2021 3:30 PM GMT
పీకే టీం రంగంలోకి దిగినట్లేనా ?
X
తెలంగాణాలో షర్మిల పార్టీ తరపున రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం రంగంలోకి దిగినట్లే ఉంది. తాజాగా లోటస్ పాండ్ లోని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పీకే టీం భేటీ అయ్యింది. తెలంగాణాలో పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని షర్మిల ఇఫ్పటికే అనేకసార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు, షర్మిల చేస్తున్న ప్రకటనలకు ఏమాత్రం సింకవ్వటంలేదు.

తెలంగాణా జనాలు షర్మిలను ఆదరిస్తున్నట్లు పెద్దగా కనబడటంలేదు. అందుకనే షర్మిల పార్టీపై జనాల్లో చర్చలు కానీ నమ్మకం కానీ ఎక్కడా కనబడటంలేదు. అందుకనే నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీ అంటు షర్మిల ఊరూరా తిరుగుతు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా జనస్పందన అంతంతమాత్రంగానే ఉంది. పైగా మిగిలిన రాజకీయపార్టీలు కూడా షర్మిలను పెద్దగా గుర్తించటంలేదు.

అందుకనే టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నా ఎవరు కూడా షర్మిల ప్రస్తావన తేవటంలేదు. కేసీయార్ కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎంతగా గోల చేస్తున్నా ఎవరు కూడా షర్మిలను కనీసమాత్రంగా కూడా గుర్తించటంలేదు. ఇలాంటి నేపధ్యంలో షర్మిలపార్టీని జనాల్లోకి తీసుకెళ్ళే ప్లాన్ తోనే పీకే బృందం తాజా సమావేశమైందట.

పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధానం, పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేయటం, పాదయాత్ర లాంటి అనేక అంశాలపై వీళ్ళమధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఇలాంటి పరిస్ధితుల్లో షర్మిల పార్టీకి జనాల ఆదరణ గనుక తేగలిగితే పీకే గట్టోడని అనుకోవాల్సిందే.