Begin typing your search above and press return to search.

ప్ర‌ణయ్ ను నేనే హ‌త్య చేయించా:మారుతీరావు

By:  Tupaki Desk   |   15 Sep 2018 9:04 AM GMT
ప్ర‌ణయ్ ను నేనే హ‌త్య చేయించా:మారుతీరావు
X
మిర్యాలగూడలో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప‌రువు హ‌త్య ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఉత్త‌రాది రాష్ట్రాల‌కే ప‌రిమిత‌మైన ప‌రువు హ‌త్య‌ల సంస్కృతి....తెలుగు రాష్ట్రాల‌కు పాక‌డం క‌ల‌క‌లం రేపింది. అంద‌రూ చూస్తుండ‌గానే ప‌ట్ట‌ప‌గ‌లు ప్ర‌ణ‌య్ అనే యువ‌కుడిని అత్యంత దారుణంగా న‌రికి చంపిన ఉదంతంతో మిర్యాల గూడ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డంది. వేరే సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌ణ‌య్ ను త‌న కూతురు అమృత కులాంత‌ర వివాహం చేసుకుంద‌న్న అక్క‌సుతో ఆమె తండ్రి మారుతీ రావు - బాబాయ్ శ్ర‌వ‌ణ్ లు ఈ దారుణానికి ఒడిగ‌ట్టిన‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కిరాయి హంత‌కుడితో ఈ హ‌త్య‌కు వారిద్ద‌రే వ్యూహ‌ర‌చ‌న చేసిన‌ట్లు పోలీసులు కూడా ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో - తాజాగా మారుతీరావు - శ్ర‌వ‌ణ్ ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ హ‌త్య‌ను తామే చేయించామ‌ని వారు అంగీక‌రించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు మారుతీరావు - శ్రవణ్ లను గోల్కొండ పోలీసులు శ‌నివారంనాడు అదుపులోకి తీసుకున్నారు. త‌న కూతురు అమృత‌....త‌మ‌కు ఇష్టం లేకుండా వేరే సామాజిక వ‌ర్గానికి చెందిన ప్రణయ్ ను వివాహం చేసుకుంద‌ని - ఆ అక్క‌సుతోనే ఆ హ‌త్య చేయించాన‌ని మారుతీరావు....పోలీసుల వ‌ద్ద‌ అంగీకరించాడు. ప్రణయ్ ను హత్య చేసేందుకు రూ.10 లక్షలతో ...ఓ కిరాయి హంత‌కుడితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపాడు. ఈ ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసులు మరికాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ దారుణానికి పాల్ప‌డ్డ కిరాయి హంత‌కుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మ‌రోవైపు - ప్రణయ్ హత్య నేపథ్యంలో ఈ రోజు దళిత సంఘాలు మిర్యాలగూడలో బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.