Begin typing your search above and press return to search.

మాట వినండి.. తిరుమల ప్రయాణం వాయిదా వేసుకోండి

By:  Tupaki Desk   |   29 May 2022 12:30 PM GMT
మాట వినండి.. తిరుమల ప్రయాణం వాయిదా వేసుకోండి
X
పరీక్షల సీజన్ పూర్తి కావటం.. స్కూళ్లకు సెలవులు పూర్తి కావటం.. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు.. కాలేజీలు ప్రారంభం అయ్యే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది తిరుమల కొండకు పోటెత్తుతున్నారు. దీంతో.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత భారీ రద్దీ కొండ మీద నెలకొంది. గడిచిన కొద్దిరోజులుగా విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ.. తాజాగా మాత్రం అది పీక్స్ కు చేరినట్లు చెబుతున్నారు.

ఆదివారం లెక్కల ప్రకారం చూస్తే.. క్యూ లైన్ లో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్న వారే లక్ష మంది ఉంటారని చెబుతున్నారు. ఇది కాకుండా.. కొండ మీద స్వామి వారి దర్శనం కోసం వస్తున్న వేలాది మందిని లెక్కలోకి తీసుకుంటే.. ఇది మరింత ఎక్కువ అవుతుందని చెబుతున్నారు.

స్కూళ్లు.. కాలేజీల వేసవి సెలవులు ముగింపునకు వచ్చేయటం.. అదీకాక ఇటీవల పెళ్లిళ్ల సీజన్ కూడా కావటంతో తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం రాత్రి లెక్కల ప్రకారం.. భక్తులకు స్వామివారి దర్శనానికి 48 గంటలు పడుతుందని చెబుతున్నారు.

దీంతో.. క్యూ లైన్ లో ఉన్న పెద్ద వయస్కులు.. పసిబిడ్డల తల్లిదండ్రులు.. పిల్లలు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న రద్దీ నేపథ్యంలో తిరుమల ప్రయాణాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకుంటేనే మంచిదని చెబుతున్నారు.

తిరుమలకు అన్నంతనే ఎవరికి వారు వారికున్న పలుకుబడితో ఏదో ఒక సిఫార్సు లేఖను తీసుకెళ్లే వారు తక్కువలో తక్కువ 30-40 శాతం వరకు ఉంటారు. ఇలాంటివారి సిఫార్సు లేఖలన్నింటిని ఇప్పుడు రద్దు చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అందుకే.. ఏదో రకంగా కొండకు వెళ్లి దర్శనం పూర్తి చేద్దామనుకునే దాని కంటే కూడా.. ప్రస్తుతానికి ప్రయాణాన్ని వాయిదా వేసుకొని.. మరో రెండు.. మూడు వారాల తర్వాత ప్రయాణం పెట్టుకుంటే మంచిదన్న మాట వినిపిస్తుంది.

అన్నింటికి మించి ఇప్పుడున్న రద్దీతో రానున్న వారం రోజులు ఇదే కంటిన్యూ అవుతుందని చెబుతున్నారు.
ఇప్పుడున్నట్లుగా భక్తుల రాక ఇదే రీతిలో సాగితే.. ఇబ్బందికర పరిస్థితులు ఖాయమంటున్నారు. అందుకే.. ఎవరికి వారు ముందుజాగ్రత్తల్లో భాగంగా ప్రయాణాన్ని వాయిదా వేసుకొని.. కాస్త రద్దీ తగ్గినంతనే వెళితే మంచిదన్న సూచన పలువురి నోటి నుంచి వస్తోంది.

అష్టకష్టాలు పడి స్వామివారిని దర్శించుకునే కన్నా.. కాస్త ఆగి వెళితే.. శ్రీవారిని కనులారా చూసుకునే భాగ్యం దక్కుతుంది కదా? ఎప్పుడో ఒకసారి వెళ్లే ప్రయాణాన్ని అస్వాదించాలే కానీ ఆగమాగం కాకూడదు కదా?