Begin typing your search above and press return to search.

ఢిల్లీ యువతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. వివరాలు ఇవే!

By:  Tupaki Desk   |   3 Jan 2023 11:30 AM GMT
ఢిల్లీ యువతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. వివరాలు ఇవే!
X
కొత్త సంవత్సరం రోజు ఢిల్లీలో ఒక యువతిని దాదాపు 12 కిలోమీటర్ల మేర కారు ఈడ్చుకెళ్లిన ఘటనలో యువతి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె శరీరంపై దుస్తులు చినిగిపోయాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, ఆప్, తదితరులు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ఆమె ప్రైవేటు పార్ట్స్‌ పై ఎలాంటి గాయాలు లేవని ప్రకటించారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉండొచ్చన్న అనుమానాలకు చెక్‌ పడింది. ఢిల్లీలోని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలోని మెడికల్‌ బోర్డు పోస్టుమార్టం నిర్వహించింది.

ఆమె స్కూటీని నిందితులు ఢీకొట్టారని.. ఈ క్రమంలో ఆమె యాక్సిల్‌ కారు చక్రంలో ఇరుక్కుపోయిందని.. ఇది గమనించని నిందితులు దాదాపు 12 కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకుపోయారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో నిందితులు ఐదుగురు తాగి ఉన్నారని చెబుతున్నారు.

మరోవైపు ప్రమాదానికి ముందు ఆ యువతి స్కూటీపై ప్రయాణించిన మరో యువతిని కూడా సీసీ టీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి ముందే ఆ యువతి తన గమ్యస్థానంలో దిగేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె నుంచి కూడా వివరాలు సేకరించారు.

మరోవైపు ఆప్‌ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ అరోరాను కలిసి, కంఝవాలా ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. నిందితులకు రక్షణ కల్పించారని ఆరోపిస్తూ జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్‌ను కూడా తొలగించాలని కోరారు.

కాగా మరణించిన 20 ఏళ్ల మహిళకు ప్రాథమిక తరగతులు చదువుతున్న ఇద్దరు తమ్ముళ్లతోపాటు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారని తెలుస్తోంది. యువతి తండ్రి దాదాపు ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. కిడ్నీ పేషెంట్‌గా ఉన్న తల్లి లాక్‌డౌన్‌ సమయంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఇంటి పనిమనిషిగా ఉద్యోగం కోల్పోయింది. వేరే ఆదాయ మార్గం లేకపోవడంతో 8వ తరగతి వరకు చదివిన ఆ మహిళ ఈవెంట్స్‌లో సహాయక సిబ్బందిగా పనిచేయడం ప్రారంభించింది. తద్వారా తన కుటుంబం మొత్తానికి పెద్ద దిక్కుగా ఉంది.

మరోవైపు కంజవాలా రోడ్డు ప్రమాదం కేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు సోమవారం మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఐదు రోజుల కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ కోరుతూ వచ్చిన దరఖాస్తును విన్న మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ అజయ్‌ సింగ్‌ పరిహార్‌ మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు నిందితులను కస్టడీలో ఉంచాలని పోలీసులు కోర్టుకు నివేదించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.